పని చేయకుంటే తొలగింపు: ప్రధాని మోడీ హెచ్చరిక
న్యూఢిల్లీ: పని బాగా చేయకుంటే తొలగించడం తప్పదని ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లోని మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులు అన్ని విషయాల పైన అవగాహన పెంచుకోవాలని ప్రధాని సూచించారు. మంత్రిత్వ శాఖల పని తీరు పైన ప్రధాని మోడీ బుధవారం సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వ అభివృద్ధి అజెండాను త్వరితగతిన అమలు చేయడంపై ప్రధాని మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. బుధవారం కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో కొన్ని మంత్రిత్వశాఖల ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. మంత్రి మండలితో ప్రధాని మోడీ ఇలాంటి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. పప్పుధాన్యాల ధరలు పెరగడం పట్ల మోదీ ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతి నెలా నాలుగో బుధవారం ఇలాంటి సమావేశాలు నిర్వహించి ఆయా మంత్రిత్వశాఖల పని తీరును సమీక్షించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఢిల్లీ, బిహార్ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓటమి నేపథ్యంలో మంత్రిత్వశాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించడం గమనార్హం.
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఈ సమాశంలో ప్రధాని మోడీ పదేపదే నొక్కి చెప్పారు. కొన్ని పథకాలు ఎందుకు వేగంగా అమలు కావడం లేదని ప్రధాని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇబ్బందులను ఎలా పరిష్కరించుకోవాలో చర్చించారు.
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను సకాలంలో అమలు చేయాల్సిన ప్రాధాన్యం గురించి కార్యదర్శులకు, మంత్రులకు ప్రధాని హితబోధ చేశారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం కోసం తాజా ప్రతిపాదనలను పంపించడంలో ఎటువంటి జాప్యం జరగరాదని, ఆమోదం లభించాక వాటి అమలుకు నిర్ధారిత గడువుని పాటించాలని స్పష్టం చేశారు.
ఫిబ్రవరి 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండడం, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
మంత్రిమండలి నుంచి తప్పించే లేదా శాఖల మార్పు ఉండే వారిలో రాంకృపాల్ యాదవ్, గిరిరాజ్ సింగ్, మనోజ్ సిన్హా, సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. బిజెపికి చెందిన రాజ్యసభ ఎంపీ, సీనియర్ పాత్రికేయుడు ఎంజె అక్బర్ను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సహాయ మంత్రిగా తీసుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.