దోపిడీ, దాడి కేసులో దావూద్ ఇబ్రహీం తమ్ముడు అరెస్టు
ముంబై: అండర్ వరల్డ్ మాఫియా నాయకుడు దావూద్ ఇబ్రహీం తమ్ముడు ఇక్బాల్ కస్కర్తో సహా అతడి ఇద్దరు అనుచరులు షేక్ జావెద్, హనీఫ్ అలియాస్ పప్పులను ముంబై పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
సలీమ్ షైఖ్ అనే రియల్ ఎస్టేట్ ఏజెంటుపై దాడికి యత్నించడమే కాకుండా, అతిడి నుంచి రూ. 3 లక్షలు లాక్కునేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై కస్కర్తో పాటు అతడి అనుచరులిద్దరిపై బైకుల్లా పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ సంఘటన దక్షిణ ముంబై ప్రాంతంలోని బేండీ బజారుకు సమీపాన ఉన్న దామర్ వాలా బిల్డింగ్ రూంలో జరిగిందని తెలిపారు. ఈ ఆరోపణలపై ముంబై జేజే మార్గ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.2003లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన తర్వాత కస్కర్ ముంబైలో హత్య, కుట్ర కేసుల్లో నాలుగేళ్లు జైల్లోనే ఉన్నాడు. అనంతరం ఆ రెండు కేసుల్లో నిర్దోషిగా 2007లో తిరిగి బయటకు వచ్చాడు.