తలకాయ కూర ఇష్టమా?.. మీ తల గిర్రున తిరగడం ఖాయం: బట్టబయలు చేసిన వీధి కుక్కలు
విశాఖపట్నం: మాంసాహారం అంటే పడి చచ్చే భోజన ప్రియులు చాలామంది ఉంటారు. రోజూ నాన్ వెజ్ వడ్డించినా లొట్టలేసుకుంటూ మరీ తినే ఘటికులూ ఉన్నారు. నాన్ వెజ్ అందుబాటులో లేకపోతే, కనీసం కోడిగుడ్డు అయినా లేకపోతే ముద్ద దిగదు. మాంసాహారాన్ని తినే భోజన ప్రియుల్లో చాలామందికి తలకాయ కూర అంటే ఇష్టం ఉంటుంది. ఓ ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మెనూలో తలకాయ కూర కనిపిస్తే నోరూరుతుంది. రేటు గురించి ఆలోచించకుండా, నాణ్యత గురించి పట్టించుకోకుండా సుష్టుగా తిని బ్రేవ్ మని తేన్పుతుంటారు. విశాఖ జనాలు మాత్రం తలకాయ కూర తినాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనికి కారణం- కొందరు హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు గొర్రె, మేక తలకాయలను దేశ రాజధాని నుంచి తెప్పించుకుంటున్నారు. ఇందులో తప్పేముంది అని అనుకుంటే పొరపడ్డట్టే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, గోనె సంచుల్లో తలకాయలు, కాళ్లను కుక్కేసి.. రైళ్లల్లో పడేస్తున్నారు. సుమారు 1800 కిలోమీటర్ల దూరం నుంచి ఆ రైళ్లు ముక్కుతూ, మూలుగుతూ విశాఖకు చేరుకునే సరికి కనీసం 3-4 రోజులు పడుతోంది. ఈలోగా ఆ తలకాయలు కాస్తా..పాచిపోయి, దుర్వాసనను వెదజల్లుతున్నాయి. అయినప్పటికీ.. వాటిని అక్కడే కడిగేసి, వండి వార్చుతున్నారు హోటళ్ల నిర్వాహకులు.
ఓ తమాషా సంఘటనతో ఈ విషయం బహిర్గతమైంది. విశాఖ టూరిస్ట్ డెస్టినేషన్. దీనివల్ల పెద్ద సంఖ్యలో జనం ఈ నగరాన్ని సందర్శించడానికి వస్తుంటారు. అలా వచ్చిన సందర్శకులు భోజనం చేయాలంటే హోటళ్లు, రెస్టారెంట్ల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. తప్పదు. ఇలాంటి సందర్భాల్లో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా తలకాయ కూరకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనితో వాటికి మంచి డిమాండ్ ఏర్పడింది.
ఈ డిమాండ్ ను తట్టుకోవడానికి నిర్వాహకులు ఢిల్లీ నుంచి మేక, గొర్రెల తలకాయలు, కాళ్లను తెప్పిస్తున్నారు. ఏక మొత్తంలో కొనుగోలు చేస్తుండటం వల్ల వాటి రేటు కూడా తక్కువే పడుతోందట. ఒక్కో తలకాయ 25 రూపాయల నుంచి 35 రూపాయల్లోపే పలుకుతోంది. దీనితో ఢిల్లీ నుంచి వాటిని తెప్పిస్తున్నారు. అంత దూరం నుంచి వచ్చేటప్పటికి అవి కుళ్లిపోతున్నాయి. సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులతో తలకాయ కూరను వడటం వల్ల అవి కుళ్లిపోయినట్లు మనకు తెలియదు. ఇక ఎందుకూ పనికి రాని వాటిని మాత్రమే పారేస్తున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు వచ్చిన దక్షిణ్ లింక్ ఎక్స్ప్రెస్లో మేక తలకాయలు, కాళ్లతో ఉన్న పార్శిళ్లు కనిపించాయి.
వాటిలో కొన్ని పాడై పోవడంతో వ్యాపారులు వాటిని విశాఖలోని 8వ నంబర్ ఫ్లాట్ఫామ్పై వదిలేసి వెళ్లిపోయారు. మేక తలకాయలున్న గోనె సంచులను కుక్కలు చించేయడంతో బండారం బయటపడింది. ఒక్కసారిగా అవి బయటపడి దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని దూరంగా పారేయించారు. వీటిని నియంత్రించాల్సిన ఆహార కల్తీ నియంత్రణశాఖతో పాటు గ్రేటర్ విశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇవి నగరంలోని మాంసం దుకాణాలకు చేరి పోతున్నాయి.