ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ప్రారంభం కానున్నాయి. తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్.. ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం జనాకర్షక విధానాలను అనుసరించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.

రేపే బడ్జెట్..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్- ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే సంవత్సరం సార్వత్రిక పోరు ఉన్న నేపథ్యంలో- ప్రస్తుతం అందరి దృష్టీ.. నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనలపైనే నిలిచింది. ఎలాంటి తాయిలాలను ప్రకటిస్తారనేది ఉత్కంఠత రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే క్రమంలో అనేక రకాలుగా భారం మోపినప్పటికీ- ఈ దఫా అలాంటి చర్యలు తీసుకోకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇవ్వాళే ఆర్థిక సర్వే..
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే అత్యంత కీలకమైన ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాళే సభలో ప్రవేశపెట్టనుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అనంతరం నిర్మల సీతారామన్- ఆర్థిక సర్వేను టేబుల్ చేస్తారు. కేంద్ర ఎకనమిక్ డివిజన్ ఈ సర్వే నివేదికను రూపొందించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుందీ విభాగం. ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో ఎకనమిక సర్వే రిపోర్ట్ రూపుదిద్దుకుంది.

ఆర్థిక ప్రగతి ఎలా ఉండబోతోంది..?
ఈ ఎకనమిక్ సర్వే ద్వారా 2023-2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ ప్రగతి ఎలా ఉండబోతోందనే విషయం మీదా ఓ స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. 1950-51 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఆర్థిక సర్వేను అప్పటి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఓ భాగంగా దీన్ని టేబుల్ చేసింది. 1960-61లో బడ్జెట్ ప్రతిపాదనల నుంచి దీన్ని వేరు చేశారు. వార్షిక బడ్జెట్ సమర్పించడానికి ఒకరోజు ముందు ఎకనమిక్ సర్వేను సభలో ప్రవేశపెట్టే ఆనవాయితీని కేంద్రం మొదలు పెట్టింది.

2022లో ఇలా..
2022-23 ఆర్థిక సర్వే వేసిన అంచనాలు తప్పినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును కేంద్ర ప్రభుత్వం 8.0-8.5 శాతంగా అంచనా వేసింది. ఇది 7 శాతం వద్దే ఆగిపోతుందనే అంచనాలు ఉన్నాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఈ నెల మొదట్లోనే దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా నమోదవుతుందని పేర్కొంది. ఈ పరిస్థితుల మధ్య తాజాగా ఆర్థిక సర్వే ఏం చెబుతుందనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications