ఇండియా ఫస్ట్- సిటిజన్ ఫస్ట్- మహిళా కార్డ్ వేసిన ప్రధాని మోదీ..!!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ హాజరయ్యారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవ్వాళ ఆరంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తోన్నారు. వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఈ సమావేశాలను ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా సమరానికి సన్నద్ధమౌతోన్నాయి. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకుంటోన్నాయి.
ధరల మీద..
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, జీఎస్టీ, పెట్రోల్-డీజిల్ రేట్లు.. ఇవన్నీ ఉభయసభల్లో ప్రస్తావనకు తీసుకుని రానున్నారు. సరిహద్దుల్లో చైనా దూకుడును ప్రదర్శిస్తోండటం, నానాటికీ పడిపోతూ వస్తోన్న రూపాయి విలువ, ఇతర అంశాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకున్నాయి. భారత్ జోడో యాత్ర పూర్తయినందున రాహుల్ గాంధీ ఈ సమావేశాలకు హాజరు కానున్నార
ఇండియా ఫస్ట్..
పార్లమెంట్ సమావేశాలు ఆరంభం కావడానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విలేకరులతో మాట్లాడారు. ఈ బడ్జెట్ సమావేశాలకు ఎంతో ప్రత్యేకత, ప్రాధాన్యత ఉందని చెప్పుకొచ్చారు. ఇండియా ఫస్ట్- సిటిజన్ ఫస్ట్ అనే నినాదంతో ఈ సమావేశాలను కొనసాగిస్తామని వివరించారు. ఉభయ సభల సమావేశాలు సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభలో చర్చకు వచ్చే బిల్లులపై అర్థవంతమైన చర్చ జరగాలని ఆకాంక్షించారు. ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇద్దరూ మహిళలే..
పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని మోదీ వ్యాఖ్యానించారు. ఆమె మొట్ట మొదటి ప్రసంగం మన రాజ్యాంగానికి, మహిళల ఆత్మ గౌరవానికి నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోందని మోదీ అన్నారు. ఆర్థిక మంత్రి కూడా మహిళేనని, ఆమె ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం దేశం ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తోన్నారని వ్యాఖ్యానించారు.
అస్థిరత మధ్య..
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా అస్థిరత ఏర్పడిందని, అలాంటి పరిస్థిితుల్లో తాము ఎలాంటి బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతామనే విషయం పట్ల ఇతర దేశాలు కూడా గమనిస్తోన్నాయని మోదీ అన్నారు. దేశ బడ్జెట్.. సాధారణ పౌరుల ఆశలు, ఆకాంక్షలను తీర్చుతుందనే విశ్వాసం తనకు ఉందని వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి తనవంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తారని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు.