ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపు -రైల్వేలకు 5 MHz స్పెక్ట్రమ్ కేటాయింపు: కేంద్ర కేబినెట్ నిర్ణయాలు
దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తిగా కేంద్రమే చేపడుతుందనే ప్రకటన వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంటలకు కనీస మద్దతు ధర పెంపు, రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి శుభవార్తలు వెలువరించారు.
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటల కనీస మద్దతు ధరలను (MSP) కేంద్రం ఖరారు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బుధవారం జరిగిన కేబినెట్ కమిటీ సమావేశంలో నూతన కనీస మద్దతు ధరలకు ఆమోదం లభించింది. 2021-22 మార్కెట్ సీజన్కు ఈ ధరలు వర్తిస్తాయి. కేబినెట్ సమావేశం అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమావేశం వివరాలను వెల్లడించారు.

ధాన్యం క్వింటాకు రూ.72 మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ.1868 ఇస్తుండగా.. ఇకపై రూ.1940 చెల్లించనున్నారు. ధాన్యంతో పాటు ఇతర పంటల ఎంఎస్పీని కూడా ప్రకటించారు. క్వింటా నువ్వులకు కనీస మద్దతు ధరను రూ.452 మేర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్వింటా కంది, మినముల కనీస మద్దతు ధరను కూడా రూ.300 మేర పెంచింది. క్వింటా జొన్నలకు ప్రస్తుతం రూ.2,150 ఇస్తుండగా.. దాన్ని రూ.2,250కి పెంచారు. భవిష్యత్లోనూ కనీస మద్దతు ధరలు కొనసాగుతాయని మంత్రి ప్రకటించారు.
భారతీయ రైల్వేలో కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 700 MHz బ్యాండ్లో 5 MHz స్పెక్ట్రమ్ను కేటాయించింది. ఈ ప్రాజెక్ట్కు రూ.25వేల కోట్లు ఖర్చు చేయనుంది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం రైల్వే శాఖ కమ్యూనికేషన్లు, సిగ్నలింగ్ కోసం ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్పై ఆధారపడుతోంది. స్పెక్ట్రమ్ కేటాయింపు వల్ల కమ్యూనికేషన్ల వ్యవస్థ బలోపేతం అవుతుందని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.












Click it and Unblock the Notifications