అరుణాచల్లో రాష్ట్రపతి పాలన: సిఫార్సు చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయడం కంటే కూడా, దాన్ని సుప్తచేతనావస్తలో ఉంచి, రాష్ట్రపతి పాలన సాగించాలని మంత్రి వర్గం ఇచ్చిన సలహా వైపే ప్రధాని మోడీ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
జనవరి 14న అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. అయితే గతేడాది డిసెంబర్ 16న సమావేశాలున్నాయంటూ శాసనసభ ఉపసభాపతి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో పాటు గౌహతి హైకోర్టు సస్పెండ్ చేసిన 14 మంది ఎమ్మెల్యేను ఉపసభాపతి తిరిగి అసెంబ్లీలోకి అనుమతించారు.
ఇందుకు ఆగ్రహించిన స్పీకర్.... డిప్యూటీ స్పీకర్ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఆ రాష్ట్ర గవర్నర్పై కూడా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు అసెంబ్లీ సమావేశాలపై స్టే విధించింది.
60 మంది ఎమ్మెల్యేలున్న అరుణాచల్ ప్రదేశ్లో అధికార కాంగ్రెస్ పార్టీకి 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, సీఎంగా ఉన్న నబమ్ తుకికి వెనుక 26 మందే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసభాపతికి అదే పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులు మద్దతు పలుకుతున్నారు.