అమిత్ షాకు అస్వస్థత.. చివరి నిమిషంలో కార్యక్రమాలు రద్దు!
కర్ణాటకలోని హుబ్బళ్లి వేదికగా శనివారం జరగాల్సిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ఒక భారీ విద్యా, వైద్య కార్యక్రమంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ చారిత్రక ఘట్టంలో ముఖ్య అతిథిగా ప్రసంగించి, నూతన వైద్య సౌకర్యాలను జాతికి అంకితం చేయాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అకస్మాత్తుగా తీవ్ర ఆరోగ్య సమస్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి సమయానికే హుబ్బళ్లి చేరుకున్నప్పటికీ, శనివారం ఉదయానికి అనారోగ్యం క్షీణించడంతో ఆయన డాక్టర్ల అత్యవసర సలహా మేరకు తాను బస చేసిన హోటల్ గదికే పరిమితం కావలసి వచ్చింది.
గబ్బూర్ ప్రాంతంలో కెఎల్ఈ (KLE) సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన జగద్గురు గంగాధర మహాస్వామిగారు మూరుసావిరమఠ్ వైద్య కళాశాల నూతన భవనం, దాంతో పాటు రూపుదిద్దుకున్న 1,200 పడకల భారీ ఆసుపత్రి, మెడికల్ రీసెర్చ్ సెంటర్లను ప్రారంభించేందుకు ఏర్పాట్లన్నీ శోభాయమానంగా పూర్తయ్యాయి. అయితే సభ ప్రారంభమయ్యే సమయానికి కేంద్ర మంత్రి అమిత్ షా రాకపోవడంతో సభకు విచ్చేసిన వేలాది మంది ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కెఎల్ఈ సంస్థల ఛైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభాకర్ కోరే వేదికపైకి వచ్చి.. అమిత్ షా అస్వస్థత విషయాన్ని అధికారికంగా ప్రకటించి, సభకు వచ్చిన వారందరికీ హోంమంత్రి తరఫున క్షమాపణలు తెలుపుతూ సందేశాన్ని చదివి వినిపించారు.

దిగ్గజ నాయకుల సమక్షంలో వేడుకగా ప్రారంభోత్సవం!
ప్రధాన ఆకర్షణగా నిలవాల్సిన అమిత్ షా గైర్హాజరైనప్పటికీ, నిశ్చయించిన ముహూర్తానికే అత్యున్నత స్థాయి ఆసుపత్రి, మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాలను విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కర్ణాటక వైద్య విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, బెళగావి ఎంపీ జగదీష్ షెట్టర్లతో పాటు మూరుసావిరమఠానికి చెందిన శ్రీ గురుసిద్ధ రాజయోగీంద్ర స్వామీజీ సంయుక్తంగా ఈ బృహత్తర విద్యా, వైద్య ప్రాంగణాలను ప్రారంభించి ప్రజాసేపకు అంకితం చేశారు.
తదుపరి పర్యటనపై ఉత్కంఠ!
ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం తర్వాత బెళగావి జిల్లాలో నిర్మించిన 'శ్రీ బీరేశ్వర కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ' నూతన కేంద్ర కార్యాలయ భవనాన్ని కూడా అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఉదయం ఎదురైన అస్వస్థత నేపధ్యంలో వైద్య బృందం ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. డాక్టర్ల గ్రీన్ సిగ్నల్ లభిస్తే తప్ప తదుపరి కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొనే అవకాశం లేదని, అవసరమైతే బెళగావి పర్యటనను కూడా రద్దు చేసుకుని నేరుగా ఢిల్లీ పయనం కానున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి.














Click it and Unblock the Notifications
