మోదీ - షా అమ్ముల పొదిలో "రామ"బాణం : 2024 హ్యాట్రిక్ పై గురి..!!
కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందు కోసం ప్రజలను ఆకట్టుకొనే అస్త్రాలను సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసారు. ఈ ప్రకటన బీజేపీకి మైల్ స్టోన్ గా మారే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది తొమ్మది రాష్ట్రాల్లో ఎన్నికలు.. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం బీజేపీకి కలిసి స్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వరుసగా మూడో సారి హ్యాట్రిక్ విజయం సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
అయోధ్య రామాలయం కు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేసారు. జనవరి 1, 2024 నాటికి రామ మందిరం సిద్దం అవుతుందని.. ప్రారంభం జరుగుతుందని అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో జన్ విశ్వాస్ యాత్ర ప్రారంభించిన అమిత్ షా కాంగ్రెస్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు. రాహుల్ బాబా వినండి.. అయోధ్య రామ మందిరం ప్రారంభ తేదీలు ప్రకటిస్తున్నానని చెబుతూ.. జనవరి 1, 2024 న అందుకు ముహూర్తం కానుందని ప్రకటించారు. అప్పటికి రామ మందిరం భక్తుల కోసం సిద్దంగా ఉంటుందని వెల్లడించారు. రామాలయాన్ని కాంగ్రెస్ అడ్డుకుందని షా ఆరోపించారు.
సుదీర్ఘ కాలం అయోధ్య రామాలయం వ్యవహారం పైన వివాదం కొనసాగింది. సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తరువాత తుది తీర్పు వెల్లడించింది. రామాలయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభింంచింది. 2020, ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్యలో భవ్యరామ మందిరానికి శంకుస్థాపన చేసారు. ఆలయ నిర్మాణ బాధ్యతలను రామతీర్ధ క్షేత్ర ట్రస్టుకు అప్పగించారు. ఇప్పటికే 55 శాతం పనులు పూర్తయినట్లు ట్రస్టు ప్రకటరించింది. దేవీ దేవతా విగ్రహాలను పూర్తి చేసి2024 జనవరి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. మొత్తం 2.77 ఎకరాల్లో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. మొత్తం 392 స్థంభాలు..12 ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేత రాహుల్ జోడో యాత్ర ఉత్తర ప్రదేశ్ లో కొనసాగుతోంది. రామ మందిర్ ట్రస్టు ప్రముఖులు రాహుల్ ను కలిసారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఇప్పుడు చేసిన ప్రకటన ఎన్నికల ఏడాదిలో కీలకం కానుంది.