సహాయక శిబిరంలో నిద్రపోతున్నారా?: కేంద్రమంత్రికి షాకిచ్చిన నెటిజన్లు
తిరువనంతపురం: ఓ వైపు కేరళ ప్రజలు భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. సహాయ పునరావాస శిబిరంలో నిద్రిస్తున్న ఫొటోలు పెట్టడంపై కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రమంత్రి ఆల్ఫోన్స్ సహాయక శిబిరంలో నిద్రిస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు.
ప్రధానికి, అమిత్ షాకు ట్యాంగ్ చేశారు..
అంతేగాక, ఆల్ఫోన్స్ ఫొటోలను ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సహా పలువురిని ట్యాగ్ చేశారు. అయితే, ఆయన పోస్టు చేసిన పరుపుపై నిద్రిస్తున్న ఫొటోలకు ప్రశంసలు రాకపోగా.. నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు.
ప్రచారానికిదా సమయం?
‘సార్ ఇది జోక్ కాదు.. ఇలాంటి ప్రదర్శనలకు ఇది సమయం కాదు' అంటూ ఓ నెటిజన్ హితవు పలికారు. కేంద్రమంత్రిగా కేరళకు సాయం చేయాల్సిన మీరు ఇలాంటి చవకబారు ప్రచార ఎత్తుగడకు దిగడం సరైంది కాదంటూ మరో నెటిజన్ చురకలంటించారు.
మీరు మాత్రం బాగానే నిద్రపోయారు..
సహాయక శిబిరంలో మీరు ప్రశాంతంగా నిద్రించినా.. రేపటిపై బెంగతో చాలా మంది నిద్రకు నోచుకోలేదనే పలువురు నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. కేంద్రమంత్రి తన ఫొటోలకు ప్రశంసలు లభిస్తాయని భావించినా.. స్లీపింగ్ ఛాలెంజ్ అంటూ నెటిజన్లు మాత్రం తీవ్రమైన ట్రోల్స్తో షాకిచ్చారు.
సహాయక చర్యలు ముమ్మరం
కాగా, రెండు మూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కేరళలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర సహాయక బృందాలు వరద బాధిత ప్రాంతాల పునర్నిర్మాణ పనులు వేగంగా చేపడుతున్నాయి.