కేంద్ర పెద్దలకు కరోనా కాటు -మంత్రి సంతోష్ గాంగ్వార్, ఇద్దరు బీజేపీ ఎంపీలకు పాజిటివ్ -ఇంకా ఎందరు?
భారత్ లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా, గతంలో కంటే వాయువేగంగా కొనసాగుతున్నది. రోజువారీ కేసులు, మరణాల్లో రికార్డులు నమోదవుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై సహా రాజకీయ రాజయధాని ఢిల్లీలోనూ మహమ్మారి విజృంభిస్తున్నది. కేంద్రం పెద్దలు, అధికార బీజేపీ నేతలు వైరస్ కాటుకు గురవుతున్నారు..
కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి (ఇండిపెండెంట్) సంతోష్ గంగ్వార్ తోపాటు రాజ్యసభ బీజేపీ ఎంపీలు సరోజ్ పాండే, అనిల్ బలూనీలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కేంద్ర మంత్రి, ఇద్దరు బీజేపీ ఎంపీలు ఒకేసారి కరోనా బారినపడటం, నిన్నమొన్నటిదాకా వారంతా అధికారిక సమావేశాల్లో వందల మందిని కలిసి ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

తాను కరోనా బారినపడిన విషయాన్ని కేంద్ర మంత్రి గాంగ్వర్ స్వయంగా వెల్లడించారు. ''నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ కరోనాకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన పార్టీ కార్యకర్తలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని హోమ్ క్వారెంటైన్లో ఉండాలి. కలిసికట్టుగా మహమ్మారిపై విజయం సాధిద్దాం'' అని గాంగ్వర్ ట్వీట్ చేశారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం విడుదల చేసిన లెక్కల ప్రకారం, దేశంలో నిన్న ఒకే రోజు రికార్డు స్థాయిలో 1,61,736 కొత్త కేసులు, 879 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,36,89,453కు, మరణాల సంఖ్య 1,71,058కు పెరిగింది. గత 24గంటల్లో కొత్తగా 97,168 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,22,53,697 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 12,64,698 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 10,85,33,085 డోసుల టీకాలను వేసినట్లు కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications