పాకిస్థాన్ లో మోసపోయిన భారత్ మహిళ: స్వాగతం పలికిన సుష్మా, నన్ను క్షమించండి!
గత నెలలో పాకిస్థాన్ వ్యక్తి తుపాకి గురి పెట్టి పెళ్లి చేసుకున్న భారత్ మహిళ ఉజ్మా (20) ఎట్టకేలకు నరకం నుంచి బయటపడి మనదేశానికి తిరిగి వచ్చింది.
న్యూఢిల్లీ: గత నెలలో పాకిస్థాన్ వ్యక్తి తుపాకి గురి పెట్టి పెళ్లి చేసుకున్న భారత్ మహిళ ఉజ్మా (20) ఎట్టకేలకు నరకం నుంచి బయటపడి మనదేశానికి తిరిగి వచ్చింది. ఉజ్మా రాకపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్టర్ లో స్పందించారు.
భారత్ ముద్ద బిడ్డకు స్వాగతం, మీరు పాకిస్థాన్ లో ఎదుర్కొన్న పరిస్థితులన్నింటికీ నేను క్షమాపణ చెబుతున్నానని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు. గతనెల పాకిస్థాన్ కు చెందిన తాహీర్ ఆలీ అనే వ్యక్తి తుపాకి గురి పెట్టి ఉజ్మా ను బలవంతంగా వివాహం చేసుకున్నాడు.
నరకం చూసిన ఉజ్మా
తుపాకి గురి పెట్టి వివాహం చేసుకున్న తాహీర్ ఆలీ ఉజ్మాకు నరకం చూపించాడు. అయితే ఆమె తాహీర్ ఆలీ ఇంటి నుంచి తప్పించుకుని ఇస్లామాబాద్ లోని భారత రాయబార కార్యాలయం చేరుకుని తాను పడిన కష్టాలు అక్కడి అధికారులకు చెప్పుకుని నన్ను భారత్ పంపించాలని వేడుకుంది.
భారత హైకమిషన్ లో ఆశ్రయం
ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ అధికారులు ఉజ్మా విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. భారత విదేశాంగ శాఖ ఆదేశాల మేరకు ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కార్యాలయంలో ఉజ్మాకు కట్టుదిట్టమైన భద్రతతో ఆశ్రయం కల్పించారు.
ఇస్లామాబాద్ కోర్టులో
తాహీర్ ఆలీ తనను బలవంతంగా పెళ్లి చేసుకుని వేధిస్తున్నాడని, తనకు తన దేశం వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఉజ్మా ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన ఇస్లామాబాద్ న్యాయస్థానం ఉజ్మా భారత్ వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
వాఘా సరిహద్దు వరకు భద్రత కల్పించిండి
ఉజ్మాను రోడ్డు మార్గంలో వాఘా సరిహద్దు వరకు పూర్తి భద్రతతో తీసుకు వెళ్లి భారత అధికారులకు అప్పగించాలని ఇస్లామాబాద్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పాక్ అధికారులు గురువారం వాఘా సరిహద్దు వరకు ఉజ్మాకు భద్రత కల్పించి తీసుకు వచ్చి భారత అధికారులకు అప్పగించారు.
భారత్ భూభాగాన్ని ముద్దాడిన ఉజ్మా
భారత్ భూభాగంలో అడుగుపెట్టిన వెంటనే ఉజ్మా భరతమాతను ముద్దాడింది. ఆ సందర్బంలో ఉజ్మా ఉద్వేగానికి గురైనారు. తమ బిడ్డను ప్రాణాలతో చూస్తామని ఊహించలేదని, ఉజ్మాను మాకు అప్పగించినందుకు సంతోషంగా ఉందని ఆమె కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపారు.