వార్నీ..మంత్రుల బంగ్లాల రిపేర్లకు అన్ని కోట్లా? RTI నివేదికలో షాకింగ్ నిజాలు!
ఢిల్లీలోని లూటియెన్స్ బంగ్లా జోన్లో నివసించే కేంద్ర మంత్రుల అధికారిక నివాసాల మరమ్మతులు, పునరుద్ధరణ, ఫర్నీషింగ్ కోసం 2025-26 ఆర్థిక ఏడాదిలో రికార్డు స్థాయిలో రూ.92.35 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. 2014-15లో ఖర్చు చేసిన రూ.27.47 కోట్లతో పోలిస్తే ఇది మూడింతలు పెరిగింది. పీటీఐ(ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్ కు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాధానంలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయి.
గత 12 ఏళ్లలో రూ.547 కోట్లకు పైగా వ్యయం
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ద్వారా 2014-15 నుంచి 2025-26 మధ్యకాలంలో కేంద్ర మంత్రుల నివాసాల మెయింటెనెన్స్ కోసం ప్రభుత్వం మొత్తం రూ.547.68 కోట్లు ఖర్చు చేసింది. శతాబ్ధం నాటి పాత నిర్మాణాల వల్ల ఏర్పడుతున్న సీపేజ్, చెదలు పట్టడం, పాతబడిపోయిన వైరింగ్, డ్రైనేజీ సమస్యల కారణంగానే ఈ నిర్వహణ ఖర్చు భారీగా పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ భవనాలు చాలా వరకు 80 నుంచి 100 ఏళ్ల క్రితం నిర్మాణం కావడం వల్ల వాటిని నివాసయోగ్యంగా ఉంచేందుకు క్రమం తప్పకుండా మరమ్మతులు చేయడం అనివార్యంగా మారింది.

ఏడాది వారీగా చేసిన ఖర్చు
*2014-15-రూ.27.47 కోట్లు
*2015-16-రూ.29.57 కోట్లు
*2016-17-రూ.30.10 కోట్లు
*2017-18-రూ.23.34 కోట్లు
*2018-19-రూ.23.42 కోట్లు
*2019-20-రూ.26.37 కోట్లు
*2020-21-రూ.53.87 కోట్లు
*2021-22-రూ.40.84 కోట్లు
*2022-23-రూ.73.86 కోట్లు
*2023-24-రూ.54.52 కోట్లు
*2024-25-రూ.71.98 కోట్లు
*2025-26-రూ.92.35 కోట్లు
మంత్రికి సగటున రూ.1.2 కోట్ల వ్యయం
కేంద్ర మంత్రి మండలిలో సాధారణంగా 70 నుంచి 72 మంది కేబినెట్, సహాయ మంత్రులు ఉంటారు. గత ఆర్థిక సంవత్సరంలో అయిన మొత్తం వ్యయాన్ని లెక్కించగా.. సగటున ఒక్క మంత్రి నివాసానికి రూ.1.2 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. నివాసాల్లో ఎలక్ట్రికల్ వస్తువుల మార్పిడి, ప్లంబింగ్ పనులు, టైల్స్ పునరుద్ధరణ వంటి పనులకే ఎక్కువ శాతం నిధులు వెచ్చించినట్లు అధికారులు వెల్లడించారు.
లూటియెన్స్ బంగ్లాల చారిత్రక ప్రాముఖ్యత
బ్రిటీష్ పాలనలో 1912 నుంచి 1930 మధ్య కాలంలో ఢిల్లీని నిర్మిస్తున్న సమయంలో ఈ బంగ్లా మండలాన్ని అభివృద్ధి చేశారు. ఈ భవనాలను బ్రిటీష్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆర్కిటెక్టులు డిజైన్ చేశారు. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివసిస్తున్న కృష్ణ మీనన్ మార్గ్ లోని బంగ్లాలో గతం పాత పార్లమెంట్ భవనం డిజైనర్ హార్బర్ట్ బేకర్ నివసించే వారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వీటిని కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల కోసం కేటాయించారు.














Click it and Unblock the Notifications