‘హనీమూన్’ లేదు: ప్రతీక్షణం ప్రజల కోసమన్న మోడీ
న్యూఢిల్లీ: అధికారంలోకి వచ్చిన ఈ నెల రోజుల్లో తన ప్రభుత్వం కనబర్చిన పని తీరు పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశాన్ని అన్ని విధాలుగా కొత్త పుంతలు తొక్కించాలన్న నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళతానని మోడీ ఉద్ఘాటించారు. ఈ నెల రోజుల కాలంలో లక్ష్యసాధన దిశగా తన ఆత్మవిశ్వాసం, చిత్తశుద్ధి, నమ్మకం, అంకితభావం మరింతగా ఇనుమడించాయని వెల్లడించారు. కేంద్రంలో అధికారం చేపట్టి గురువారం నాటికి నెల రోజులు పూర్తయిన సందర్భంగా మోడీ తన బ్లాగులో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ 30 రోజుల వ్యవధి ఎంతమాత్రం ‘హనీమూన్' కాలం కాదని, అధికారాన్ని చేపట్టిన వంద గంటల్లోనే చాలా తీవ్రమైన ఆరోపణలు మొదలయ్యాయని వెల్లడించారు. అనేక రంగాల్లో అన్ని విధాలుగానూ మెరుగుదలను సాధించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం ఆయన చేశారు. ఇప్పటివరకు తాము ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగానే జరిగిందని తెలిపారు. ఈ నెలరోజుల కాలంలో పలు రంగాలకు సంబంధించి ప్రభుత్వం ఏవిధంగానూ ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తిందని, అయినప్పటికీ ఈ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, అవేమిటో ఆయన స్పష్టం చేయలేదు.
కేంద్రంలోని తమ ప్రభుత్వ ఉద్దేశాల గురించి, చిత్తశుద్ధి గురించి ప్రతి ఒక్కరికి సరైన రీతిలో తెలియజేసే విషయంలో తనకు ఒక పెద్ద సవాలే ఎదురవుతోందని తెలిపారు. దేశంలోని గుణాత్మకమైన మార్పులను తీసుకురావాలన్నదే తమ ఏకైక లక్ష్యమని, ఇందుకు సంబంధించి తమ అంకితభావాన్ని అనేక కోణాల్లో రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ రకంగా తమ ఉద్దేశాలకు వక్రభాష్యం చెప్పే వ్యక్తులు ప్రభుత్వంలోనూ, బయటా ఉన్నారని అన్నారు.
ఎవరినుంచి ఎలాంటి విమర్శలు ఎదురైనా, ఆటంకాలు తలెత్తినా భారతదేశ అభివృద్ధి విషయంలో తన నిబద్ధత చెక్కుచెదరదని బ్లాగ్లో పేర్కొన్నారు. 67 ఏళ్ల పాటు కేంద్రంలో సాగిన గత ప్రభుత్వాల పాలన తమ ప్రభుత్వ ఒక నెల పాలనకు కూడా సరితూగదని వెల్లడించారు. ఈ నెలరోజుల వ్యవధిలో తను, తన మంత్రివర్గ బృందం అనుక్షణం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తూ వచ్చామని చెప్పారు.
కొత్తగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా దానికంటూ ‘హనీమూన్ పీరియడ్' ఉంటుందని, కాని తన ప్రభుత్వానికి మాత్రం ఆ రకమైన సౌలభ్యం ఏమీ లేదని తెలిపారు. ‘మాకు సంబంధించినంతవరకు ఈ రకమైన హనీమూన్ లగ్జరీ ఏమీలేదు. వంద రోజుల మాట పక్కనపెట్టండి. అధికారంలోకి వచ్చిన వంద గంటల్లోనే ఆరోపణలు మొదలయ్యాయి' అని మోడీ వెల్లడించారు. తమకు లభించిన ప్రజల ప్రేమ, మద్దతు అద్భుతమన్న ఆయన, తాము మరింత కష్టపడటానికి అది స్ఫూర్తినిస్తోందన్నారు. తమకు మద్దతు ఇచ్చిన ప్రజలకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నానని మోడీ పేర్కొన్నారు.