అన్లాక్ 5.0: అక్టోబర్ 15 నుంచి సినిమా హాల్స్ ఓపెన్, కానీ
న్యూఢిల్లీ: అన్లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది.
Recommended Video
అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేసింది. ఇప్పటికే దశలవారీగా పలు మార్గదర్శకాలను విడుదల చేసిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 30తో అన్లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని సడలింపులతో కూడిన 5.0 మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.
ఇక మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, థర్మల్ స్కానింగ్, శానిటైజర్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలలో కూడా ఇలాంటి నిబంధనలు తప్పనిసరని తెలిపింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది.
యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం.. స్విమ్మింగ్ పూల్స్.. కేవలం క్రీడాకారులకు శిక్షణ అందించేందుకు మాత్రమే తెరిచేందుకు అనుమతిచ్చింది. నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఇతర అలాంటి ప్రదేశాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. బిజినెస్ టూ బిజినెస్ ఎగ్జిబిషన్స్ ఓఫెన్ చేసేందుకు కూడా అనుమతిచ్చింది. అయితే, సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది.