గ్యాంగ్రేప్: బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు, సీబీఐ దర్యాప్తునకు యోగి ఆదేశం
లక్నో: మైనర్ బాలిపై అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉన్నావో జిల్లాలో 16ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన కుల్దీప్పై కేసు నమోదు చేయాలని ఉన్నత స్థాయి పోలీసు అధికారిని ఆదేశించారు. ఆయనకు సంబంధించి అన్ని కేసులను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. దీంతో ఆ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. కుల్దీప్పై పోస్కో చట్టంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఉన్నావో ఎస్పీ పుష్పాంజలి దేవి వెల్లడించారు.
కాగా, బుధవారం రాత్రి ఎస్పీ కార్యాలయానికి తన అనుచరులతో కలిసి వచ్చిన ఎమ్మెల్యే కుల్దీప్ లొంగిపోవడానికి నిరాకరించడంతోపాటు తనపై ఆరోపణలను ఖండించారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పారు. పెద్ద సంఖ్యలో మద్దతుదారులతో రావడంతో ఎస్పీ కార్యాలయం వద్ద ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే కుల్దీప్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు వెల్లడించారు.
ఉన్నావో కేసులో విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం.. ఈ కేసులో తీవ్రమైన వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది. పోలీసులే కాకుండా ఉన్నావో వైద్యుల వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. బాధిత బాలికకు, ఆమె కుటుంబసభ్యలకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది.
గత జూన్ 4న ఎమ్మెల్యే సెంగ తనపై అత్యాచారం చేశాడని, ఫిర్యాదు చేస్తే తన కుటుంబాన్ని చంపేస్తాడని బెదిరించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మళ్లీ తనను అపహరించి తొమ్మిది రోజుల పాటు మత్తు పదార్థాలు ఎక్కించి అనేక ప్రాంతాలు తిప్పుతూ పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. అయితే ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వాపోయింది.
ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందు ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసు విషయంలో ఎమ్మెల్యే.., బాధితిరాలి తరఫు బంధువులకు జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో బాలిక తండ్రి జైలు పాలయ్యారు. ఆయన కొద్ది రోజుల క్రితం పోలీసు కస్టడీలోనే మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.