ప్రజాకర్షక పధకాలతో శ్రీలంక దుస్థితే - ఆర్దికంగా కుదేలైన రాష్ట్రంలో : ప్రధానితో బ్యూరోక్రాట్లు..!!
ప్రజాకర్షక పథకాలు..ఉచిత స్కీంలతో దేశం శ్రీలంక సంక్షోభం వైపు ప్రయాణించే ప్రమాదం ఉందని సీనియర్ బ్యూరోకాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో పరిస్థితికి ఇటువంటి విధానాలే కారణమని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఈ పథకాల నిర్వహణ మొత్తగా ఆర్దిక రంగం పైనే ప్రభావం చూపుతోందని వారు ఆవేదన చెందారు. ఇదే రకంగా కొనసాగితే ఆర్దిక అస్థిరతకు దారి తీసే పరిస్థితులు ఉన్నాయంటూ అధికారులు ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో..శ్రీలంకలో నెలకొన్న ఆర్దిక సంక్షోభం తరహాలోనే భారత్ సైతం చిక్కుకొనే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆర్దిక పరిస్థితి క్షీణిస్తోందని హెచ్చరిక
ప్రధాని మోదీ నాలుగు గంటల పాటు వివిధ విభాగాలకు చెందిన కార్యదర్శులతో కీలక భేటీ నిర్వహించారు. పలు పాలనా పరమైన అంశాల పైన చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొన్నారు. ఆ చర్చల్లో ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని ప్రధానితో పేర్కొన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాల అమలుతో ఆర్దిక పరిస్థితి క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందంటూ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసారు.
ఇలాగే కొనసాగితే శ్రీలంక పరిస్థితులు
ఈ పరిస్థితులు ఇదే రకంగా కొనసాగితే శ్రీలంకలో ప్రస్తుత నెలకొన్న ఆర్దిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లోనూ తప్పదని హెచ్చరించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆర్దికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన ప్రజాకర్షక విధానాలను అధికారులు ప్రధాని వద్ద ప్రస్తావించారు. ఇదే తరహాలో మరి కొన్ని రాష్ట్రాలు పయణిస్తున్నాయని..ఆర్దికంగా అమలు కష్టమని తెలిసినా... ప్రజలను మోసపుచ్చుతున్నాయని వారు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ఇటువంటి విధానాల పైన తక్షణం స్పందించకపోతే భవిష్యత్ లో కష్టాలు తప్పవని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అధికారుల సూచనలను విన్న ప్రధాని..అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని స్పష్టం చేసారు. కార్యదర్శులతో ప్రధాని సమావేశమవ్వడం ఇది తొమ్మిదో సారి.
ప్రధాని కీలక సూచనలు - బాధ్యతలు
అభివృద్ధి కుంటుపడటానికి పేదరికాన్ని సాకుగా చూపుతూ చెప్పే పాత కథలను అధికారులు మానుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. సమావేశంలో ఇద్దరు కార్యదర్శులు కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును మోదీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. దీంతో..ప్రధాని సైతం అధికారులకు కీలక సూచనలు చేసారు. కరోనా సమయంలో పని చేసిన విధంగానే కలిసి కట్టుగా పని చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ అధికారులు ఆరు టీంలుగా ఖరారు చేసారు. ఒక్కో టీంకు ఒక్కో బాధ్యత అప్పగించారు. ఈ టీంలను ఉత్తమ పాలన అందించటంలో సహకారం అందించేలా.. సూచనలు - సలహాలు ఇచ్చేలా పని చేయాలని ప్రధాని మోదీ వారికి స్పష్టం చేసారు.