ఒకే కుటుంబానికి చెందిన 32 మందికి కరోనా కాటు - ఆ ఊరంతా కలకలం..
ఒక్కరూ ఇద్దరూ కాదు.. ఒకే కుటుంబానికి చెందిన 32 మంది ఒకేసారి కరోనా వైరస్ బారినపడ్డారు. ఉత్తరప్రదేశ్ లోని బాండా జిల్లా కేంద్రంలో ఈ మేరకు మంగళవారం కేసులు వెలుగులోకి వచ్చాయని స్థానిక వైద్య అధికారులు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో కొత్త కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు అక్కడి తీవ్రతను తెలియజేసేలా ఉన్నాయి.
బాండా సిటీలోని ఫుటా కువా ఏరియాలో వేర్వేరు ఇళ్లలో నివసిస్తోన్న ఒకే కుటుంబీకులు 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్డీ శర్మ తెలిపారు. ఆ ఫ్యామిలితోపాటు మరో 12 మంది కూడా ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తులను ఆస్పత్రులకు తరలించి, మిగతా వాళ్లను హోం ఐసోలేషన్ లో ఉంచినట్లు అధికారులు చెప్పారు. బాండా జిల్లాలో ఇప్పటిదాకా మొత్తం 807 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని, వాళ్లలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 360 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయని డాక్టర్ శర్మ చెప్పారు.

కరోనా కేసులు, మరణాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ దేశంలోనే ఐదో స్థానంలో ఉంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే కొత్తగా 5,343 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2.35లక్షలకు, మరణాల సంఖ్య 3,542కు పెరిగింది. అంతాకలిపి 1.76లక్షల మంది ఇప్పటికే వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 55,538గా ఉంది.
ఇక దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్యను చూస్తే, మంగళవారం స్వల్ప తగ్గుదల కనిపించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 69,921కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య37.6 లక్షలకు పెరిగింది. ఇందులో దాదాపు 29 లక్షల మంది వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8 లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications