టెక్కీలూ! నేర్చుకోకపోతే అంతే: 6లక్షల ఐటీ జాబ్స్కు ఎసరు!
కొత్త టెక్నాలజీలకు సిద్ధం కాని ఇంజినీర్లను తొలగించడాన్ని మరింత పెద్దఎత్తున ఐటీ సంస్థలు కొనసాగిస్తాయని, ఎగ్జిక్యూటివ్ల ఎంపికలో సాయపడే హెడ్హంటర్స్ ఇండియా అంటోంది.
బెంగళూరు: జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు వరుసగా ఇస్తున్న షాక్లతో ఇప్పటికే టెక్కీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా, వారికి ఆందోళన కలిగించే మరో వార్త వెలుగులోకి వచ్చింది. అదేమంటే.. కొత్త టెక్నాలజీలకు సిద్ధం కాని ఇంజినీర్లను తొలగించడాన్ని మరింత పెద్దఎత్తున ఐటీ సంస్థలు కొనసాగిస్తాయని, ఎగ్జిక్యూటివ్ల ఎంపికలో సాయపడే హెడ్హంటర్స్ ఇండియా అంటోంది.

కోత భారీగానే..
‘ఈ ఏడాది ఐటీ సంస్థల్లో 56,000 మంది ఉద్యోగాలు కోల్పోతారని వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఈ సంఖ్య 1.75-2.0 లక్షలు ఉంటుంది. మరో మూడేళ్ల పాటూ ఇంతే సంఖ్యలో ఇంజినీర్లు తొలగింపునకు గురవుతారు' అని హెడ్హంటర్స్ ఇండియా వ్యవస్థాపకుడు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె లక్ష్మీకాంత్ పేర్కొన్నారు.
మాన్యువల్ టెస్టింగ్, టెక్నాలజీ సపోర్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా పోయే అవకాశం ఉందనిపేర్కొన్నారు. కృత్రిమ మేథ, రోబోటిక్స్ ఆటోమేషన్ ఈ పనులను చక్కబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని చెప్పారు.

ముంబై, బెంగళూరుకు కొంత ఊరట
‘ఈ లెక్కన 30-40 శాతం మంది సిబ్బంది కొనసాగకపోవడం జరుగుతుంది. మొత్తం ఐటీ సిబ్బందిలో, 50-60 శాతం మంది ప్రస్తుత నైపుణ్యాలతో, సంప్రదాయ ఐటీ సేవల్లో కొనసాగవచ్చు. మిగిలినవారు తొలగింపునకు గురయ్యే అవకాశం ఉంది. రాబోయే మూడేళ్లలో ఇలా ఇబ్బంది పడేవారు 5-6 లక్షల మంది ఉండొచ్చు. అంటే సగటున ఏడాదికి 1.75 - 2.0 లక్షల మంది తొలగింపునకు గురవుతారు' అని లక్ష్మీకాంత్ విశ్లేషించారు. ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో తొలగింపులు ఉండవని, కోయంబత్తూరు వంటి మరికొన్ని చిన్న ప్రాంతాల్లో ఉంటాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ట్రంప్ ఎఫెక్ట్తోపాటు..
‘ఐటీ రంగం ఇప్పుడు అనిశ్చితిలో ఉంది. క్లౌడ్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీలు శరవేగంగా దూసుకొస్తున్నాయి. కంపెనీలు కూడా వీటిపై దృష్టి సారించి, సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నాయి. ఈ పరిణామ క్రమంలో 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న నిపుణులే ఇబ్బంది పడతారు' అని లక్ష్మీకాంత్ వివరించారు. ఇదంతా వీసా నిబంధనలను అమెరికా కఠినతరం చేయడం వల్లే జరగడం లేదన్నారు. ‘తక్కువ వేతనంపై విదేశీ నిపుణులను అమెరికాకు తీసుకెళ్లి పనిచేయించుకోవడం సరికాదని ఐటీ కంపెనీలకూ తెలుసు. స్థానికులకే ఉద్యోగాలివ్వాలన్న అమెరికా అధ్యక్షుడి నిబంధనల వల్ల ఎదురవుతున్న పరిణామాలను పరిష్కరించుకోవడం ఐటీ సంస్థల చేతుల్లో ఉంది. వాటికి ఇది కొత్త కాదు' అని పేర్కొన్నారు.

ఐటీకి పెద్ద సవాలే
ఫిబ్రవరి 17న నాస్కామ్ ఇండియా లీడర్షిప్ సదస్సులో మెకిన్సే అండ్ కంపెనీ ఇచ్చిన నివేదికను విశ్లేషిస్తే ఈ వివరాలు తెలుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం ఐటీ సేవల సంస్థల్లో ఉన్న సిబ్బందిలో దాదాపు సగం మంది, రాబోయే 3-4 ఏళ్లలో అప్పటి అవసరాలకు తగినట్లు ఉండరని ఆ నివేదిక పేర్కొంది. ‘దేశంలో దాదాపు 39 లక్షల మంది ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్నారని, టెక్నాలజీల్లో గణనీయ మార్పులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో 50-60 శాతం మంది సిబ్బందిని నిలుపుకోవడమే ఐటీ పరిశ్రమకూ పెద్ద సవాలుగా మారనుందని మెకిన్సే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నోశిర్ కాకా అప్పట్లో పేర్కొన్నారు.

నేర్చుకోకపోతే అంతే సంగతులు
ప్రస్తుత ఐటీ నిపుణులు, పరిస్థితులు మారుతున్నంత వేగంగా కొత్త టెక్నాలజీలు అభ్యసించడం లేదని, అందువల్లే వారు విధుల్లో కొనసాగే పరిస్థితి ఉండటం లేదని టీమ్లీజ్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రీతుపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు.
కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీల వల్ల తక్కువ మంది సిబ్బందితోనే పనులు పూర్తవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే సంస్థలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయని చెప్పారు. ప్రతి 3-5 ఏళ్లకు ఐటీ రంగంలో కొత్త టెక్నాలజీల ప్రవేశం జరుగుతున్నదేనని, దీనికి అదనంగా అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడం వల్ల, పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయమని ఎగ్జిక్యూటివ్ల నియామక సంస్థ గ్లోబల్హంట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ గోయెల్ తెలిపారు. మరో 1-2 ఏళ్లు ఇవి కొనసాగవచ్చని, ఐటీ నిపుణులు కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటే, తమకు గిరాకీ పెరుగుతుందని గమనించాలని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications