గుజరాత్ లో చరిత్ర పునరావృతం-మోడీ సొంతగడ్డపై కాషాయాన్ని గట్టెక్కించేందుకు యోగీ సాయం ?
గుజరాత్ లో 2002లో బీజేపీ అధికారంలో ఉంది. అప్పట్లో గోద్రాలో కొందరు అగంతకులు సబర్మతీ ఎక్స్ ప్రెస్ రైలు తగులబెట్టారు. దీంతో రాష్ట్రంలో మతఘర్షణలు చెలరేగాయి. ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలిసే లోపే వేలాది మంది ముస్లింలను ఊచకోత కోసేశారు. దీనికి ప్రతిగా తీవ్రవాదులు అక్షర్ ధామ్ ఆలయంపై దాడులకు తెగబడ్డారు. ఈ రెండు ఘటనల్ని ప్రస్తావిస్తూ అప్పట్లో ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జనంలోకి వెళ్లారు. రాష్ట్రంలో గౌరవ యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహించారు. పూర్తి హిందూత్వ అజెండాతో జనంలోకి వెళ్లి హిందూ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.
అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఘర్షణలతో మతపరమైన ఓట్ల ఏకీకరణ జరిగింది. మోడీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్న ఆరుగురితో పాటు పలువురు జాతీయ నేతల్ని ప్రచారానికి పిలిపించింది. అయినా మోడీ హవాను అడ్డుకోలేకపోయింది. బీజేపీ 182 సీట్లకు గానూ 127 సీట్లతో మరోసారి గెలిచింది. కాంగ్రెస్ కు కేవలం 51 సీట్లు మాత్రమే దక్కాయి. అప్పటికే గుజరాత్ లో అధికారంలో కొనసాగుతున్న మోడీ మరింత బలోపేతమయ్యారు. బీజేపీ ఇప్పటికీ అక్కడ గెలుస్తూనే ఉంది.కానీ ఈసారి ఎన్నికల్లో అలాంటి భావోద్వేగ అంశాలు లేవు. దీంతో ఈసారి గట్టెక్కేందుకు పూర్తిగా అభివృద్ధి అంశాల్నే నమ్ముకోవాల్సి వస్తోంది. కానీ ప్రత్యర్దిగా ఉన్న ఆప్ అదే అభివృద్ధి మంత్రంతో రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే అధికారం అందుకుంది. గుజరాత్ లోనూ గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో తిరిగి మతపరమైన అంశాలను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ యూపీ నేతల్ని రంగంలోకి దించుతోంది.

ఇప్పటికే అయోధ్యతో పాటు ఇతర మతపరమైన అంశాలతో యూపీలో వరుసగా రెండోసారి అధికారం దక్కించుకున్న బీజేపీ, యోగీ ఆదిత్యనాథ్.. ఇప్పుడు పొరుగునే ఉన్న గుజరాత్ లో అవే అంశాల్ని ప్రస్తావిస్తూ కాషాయాన్ని గట్టెక్కించే పనిలో బిజీగా కనిపిస్తున్నారు. స్వయంగా యోగీ ఆదిత్యనాథ్ తో పాటు యూపీకి చెందిన పలువురు నేతలు గుజరాత్ ప్రచారంలో చక్కర్లు కొడుతున్నారు. ఇదంతా చూస్తున్నవారికి 2002 ఎన్నికల సమయంలో గెలుపు కోసం ఏ అజెండా లేక ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి, ఇతర అజెండాల్ని ఆయా ముఖ్యమంత్రుల సాయంతో ఇక్కడ ప్రచారానికి వాడుకునేందుకు ప్రయత్నించి విఫలమైన కాంగ్రెస్ పార్టీ తరహాలోనే ఇప్పుడు బీజేపీ కనిపిస్తోందని చెప్తున్నారు.
ఓవైపు కాంగ్రెస్, మరోవైపు ఆప్ తో గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈ రెండు పార్టీల మధ్య చీలిపోయి తాము గట్టెక్కడం ఖాయమని బీజేపీ అంచనాలో ఉంది. అయితే తాజా పరిణామాలతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానం యూపీ నేతల్ని గుజరాత్ కు పంపడంతో బీజేపీ పరిస్ధితిపై అనుమానాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications