షాక్: బిజెపికి తగ్గిన సీట్లు, మెజారిటీ లేదంటున్న కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి షాక్ ఇచ్చాయి. అటు ప్రధాని నరేంద్ర మోడీకి, ఇటు యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్కు ఈ ఫలితాలు దిగ్భ్రాంతిని కలుగజేశాయనే చెప్పాలి.
గోరఖ్పూర్, పుల్పూరు స్థానాలను కోల్పోవడంతో లోకసభలో బిజెపి బలం 274 సీట్లకు తగ్గింది. సాధారణ మెజారిటికీ బిజెపికి 272 సీట్లు అవసరమవుతాయి. అయితే, బిజెపి సాధారణ మెజారిటీ కోల్పోయిందని కాంగ్రెసు వాదిస్తోంది.
తిరుగుబాటు ఎంపీలు కీర్తి ఆజాద్, శత్రుఘ్న సిన్హాలను కూడా తీసేస్తే బిజెపికి ప్రస్తుతం ఉన్న బలం 271 సీట్లేనని అంటోంది. గోరఖ్పూర్, పుల్పూరు సీట్లనే కాకుండా బిజెపి బీహార్లో ఆరిరాయా లోకసభ స్థానాన్ని కూడా కోల్పోయింది.
బిజెపికి సాధారణ మెజారిటీ లేదని కాంగ్రెసు
బిజెపి 2017 -18లో బిజెపి పది లోకసభ స్తానాలను కోల్పోయిందని రణదీప్ సింగ్ సుర్జేవాలా అంటున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బిజెపి అహంకారంపై దుష్టపాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఉప ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
మోడీకి, యోగీకి యుపి షాక్
గోరఖ్పూర్లో బిజెపి అభ్యర్థి ఉపేంద్ర దత్ శుుక్లాపై ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ 21,961 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1989 నుంచి ఈ నియోజకవర్గానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. పుల్పూరు సీటులో బిజెపి కౌశలేంద్ర సింగ్ పటేల్పై ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ 59,460 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
లోకసభలో పెరిగిన ఎస్పీ బలం
బిజెపి 2014 లోకసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బిజెపి అనూహ్యమైన విజయకేతనం ఎగురవేసింది. యపిలోని 80 సీట్లలో 73 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఎ కూటమికి అప్పుడు 43.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండు సీట్లను గెలుచుకోవడంతో ఎస్పీ బలం లోకసభలో 7కు పెరిగింది. సాధారణ ఎన్నికల్లో కేవలం ఐదు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.
బిజెపికి ఎదురీత తప్పడం లేదు
ఉప ఎన్నికల్లో బిజెపికి ఎదురీత తప్పడం లేదు. తొలి ఉప ఎన్నిక షాక్ బిజెపికి మద్య ప్రదేశ్లోని రాట్లం నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు. ఈ ఉప ఎన్నిక 2015 నవంబర్లో జరిగింది. 2014 ఎన్నికల్లో బిజెపి రాష్ట్రంలోని 29 సీట్లలో 27 సీట్లు గెలుచుకుంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి 8 సీట్లను కోల్పోయిది.
కాంగ్రెసు ఇక్కడ గెలుచుకుంది
బిజెపికి మరో షాక్ 2017లో పంజాబ్లోని గురదాస్ పూర్ ఉప ఎన్నికల్లో తగిలింది. కాంగ్రెసు ఈ సీటును గెలుచుకుంది. రాజస్థాన్లో 2014లో 25 స్థానాలను కోల్పోయిన కాంగ్రెసు ఈ ఏడాది ప్రారంభంలో ఆల్వార్, అజ్మీర్ స్థానాలను దక్కించుకుంది.
బిజెపి కొన్ని సీట్లు గెలిచింది.
అయితే బిజెపి అన్ని ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయిందనేది నిజం కాదు. అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి గెలిచింది. ఆస్సాంలోని లఖీంపూర్, మధ్యప్రదేశ్లోని శాందోల్ సీట్లను గెలుచుకుంది. వారణాసి సీటును నిలబెట్టుకుంది. మహారాష్ట్రలోని బీడ్కు గోపీనాథ్ ముండే మృతితో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కూతురు ప్రీతమ్ ముండే విజయం సాధించారు.