సినిమాను తలపించిన ఛేజింగ్ సీన్.. యూపీ మహిళా ఎమ్మెల్యేపై దుండగుల అటాక్...
రాయ్బరేలీ : ఉత్తర్ప్రదేశ్లో ఎమ్మెల్యేపై దాడి ఘటన సంచలనం సృష్టించింది. రాయ్బరేలీలోని హరచంద్పూర్లో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే అదితీసింగ్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

విశ్వాస పరీక్షకు వెళ్తుండగా..
బీజేపీ నేత, రాయ్ బరేలీ జెడ్పీ ఛైర్మన్ అవదేశ్ సింగ్ విశ్వాస పరీక్షకు హజరయ్యేందుకు అదితి సింగ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రెండు కార్లలో వచ్చిన దుండగులు తొలుత ఎమ్మెల్యే కారును చుట్టుముట్టారు. దాదాపు 50 మంది రాడ్లతో దాడికి ప్రయత్నించారు. దాడి సాధ్యం కాకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు ఆమెతో ఉన్నవారిపై రాళ్లు రువ్వారు. దుండగుల నుంచి రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా వాహనాన్ని వేగంగా ముందుకుపోనివ్వగా వెనుక కొందరు వెంబడించారు. దీంతో ఎమ్మెల్యే కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దాడి జరిగిన సమయంలో ఘటన స్థలంలోనే ఉన్న అవదేశ్ సింగ్ ఓ కారులో కూర్చొని ఈ మొత్తం వ్యవహారాన్ని చూశారని అదితి సింగ్ ఆరోపించారు.

దాడి వెనుక జెడ్పీ ఛైర్మన్ హస్తం
ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు ఈ ఘటన వెనుక రాయ్ బరేలీ బీజేపీ అభ్యర్థి, అవదేశ్ సింగ్ సోదరుడు దినేశ్ సింగ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన అనంతరం కొందరు జెడ్పీ సభ్యులు సైతం కనిపించకుండా పోయారని వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉంటే 52మంది సభ్యులు ఆలస్యంగా రావడంతో అధికారులు విశ్వాస పరీక్షను వాయిదా వేశారు.

బీజేపీ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం
ఎమ్మెల్యేపై దాడి ఘటనపై యూపీ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి రాయ్బరేలీ ఎమ్మెల్యేపై జరిగిన హత్యాయత్నం నిదర్శనమని ఆరోపించింది. ఈ దాడితో బీజేపీ నిజస్వరూపం మరోసారి బయటపడిందని విమర్శించింది.












Click it and Unblock the Notifications