దళితులపై ఆగని దాడులు: నీళ్లు తాగినందుకు త్రిశూలంతో దాడి
లక్నో: దేశంలో దళితులపై ఈ మధ్య కాలంలో దాడులు మరింతగా ఎక్కువయ్యాయి. మొన్న గుజరాత్, నిన్న మధ్యప్రదేశ్లో గో సంరక్షణ పేరుతో దళితులపై దాటి చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దళితులపై దాడికి నిరసనగా ఆయా రాష్ట్రాల్లోని దళితులు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ ఆశ్రమంలోని చేతిపంపు వద్ద నీరు తాగినందుకు గాను దళిత కుటుంబానికి చెందిన తండ్రీ కూతుళ్లపై దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... సంబాల్లోని గున్నోర్ ప్రాంతంలో స్థానికంగా కూలీ పని చేసుకునే 13 ఏళ్ల బాలిక దాహంతో నీరు తాగేందుకు సమీపంలోని దుండా ఆశ్రమం బయట ఉన్న చేతిపంపు వద్దకు వెళ్లింది.
ఈ క్రమంలో ఆశ్రమంలోని స్వామిజీతో పాటు మరికొందరు వ్యక్తులు బాలికపై దాడికి దిగారు. దీనిపై బాలిక తండ్రి ఆశ్రమంలోని వ్యక్తులను అడిగేందుకు వెళ్తే తండ్రిపై త్రిశూలంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో గాయపడిన తండ్రీకూతుళ్లు ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కేవలం తాము దళితులమే అన్న కారణం చేత తమపై దాడికి దిగారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక తండ్రి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సీ&ఎస్టీ చట్ట ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
దళితులపై దాడులు ఆపాలంటూ ప్రధాని మోడీ పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆదివారం తెలంగాణ పర్యటనలో భాగంగా కోమటిబండ బహిరంగ సభలో మాట్లాడిన మోడీ 'దళితులను కొట్టాలనుకుంటే.. నన్ను కొట్టండి. వారిని చంపాలనుకుంటే నన్ను చంపండి' అని అన్న సంగతి తెలిసిందే.
Gunnaur (Sambhal,UP): 13 year old girl denied drinking water at a temple by priest on account of her being a Dalit pic.twitter.com/3hRACsauwy
— ANI UP (@ANINewsUP) August 10, 2016