కరోనా స్ట్రెస్: వైద్యుడి చెంప ఛెళ్లుమనిపించిన నర్సు, తిట్లు, కొట్లాట(వీడియో)
లక్నో: కరోనా మహమ్మారి ప్రపంచంలో ఎవరినీ ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఇక కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ వైద్యులు, వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. రోజు రోజుకు కరోనా రోగులు పెరుగుతుండటం, వారికి వైద్యం అందించడం వారికి పెను సవాలుగా మారుతోంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ నర్సు, వైద్యుడు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వైద్యుడి చెంప ఛెళ్లుమనిపించిన నర్సు..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లా ఆస్పత్రిలో డాక్టర్కు, నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారు. చివరికి సహనం కోల్పోయిన నర్సు.. డాక్టర్ చెంప పగుళ గొట్టింది. దీంతో వైద్యుడు కూడా ఆమెపై దాడికి ప్రయత్నించాడు. అయితే, అక్కడే ఉన్న పోలీసులు వారిద్దరిని అడ్డుకున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా పని భారంతోనే.. వైద్యుడు, నర్సు ఫైట్
కాగా, ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాంపూర్ జిల్లా కలెక్టర్ రాంజీ మిశ్రా.. ఆ వైద్యుడు, నర్సుతో ఫోన్ చేసి మాట్లాడారు. గొడవకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే, పని ఒత్తిడి కారణంగానే తాము అలా ప్రవర్తించాల్సి వచ్చిందని, మరేం లేదని వైద్యుడు, నర్సు ఆయనకు వివరించడం గమనార్హం.
ఘటనపై విచారణ జరుపుతామని కలెక్టర్ తెలిపారు.

మహారాష్ట్ర తర్వాత యూపీలోనే ఎక్కువ కరోనా కేసులు
మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో యూపీలో 35,614 కరోనా కేసులు నమోదు కాగా, 208 మంది కరోనా బారినపడి మరణించారు. గత 24 గంటల్లో 25,633 కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 7,77,844 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,97,616 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.97 కోట్ల నమూనాలను పరీక్షించారు. కాగా, 35,614 కొత్త కేసులలో లక్నోలో 5,187 తాజా కేసులు నమోదయ్యాయి, తరువాత కాన్పూర్ (2,153), వారణాసి (2,057), మీరట్ (1,625), అలహాబాద్ (1,395), గౌతమ్ బుద్ధ నగర్ (1,310), బరేలీ (1,084),ఝాన్సీలో 1,021 కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications