యూపీ ఐదోదశ ఎన్నికల పోటీలో 246మంది ధనవంతులు; టాప్ లో ముగ్గురు బీజేపీ నుండే
ఉత్తరప్రదేశ్లో ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతుంది. నువ్వా నేనా అన్నట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల యుద్ధంలో పోరాడుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేర చరిత్ర పై, వారి ఆర్థిక స్థితిపై అధ్యయనం చేసిన ఏడీఆర్ ఉత్తర ప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ ది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆర్థిక స్థితి పరంగా ఐదో విడత అభ్యర్థులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
Recommended Video
బారాబంకి, చిత్రకూట్, గోండా, కౌశాంబి, అమేథీ, అయోధ్య, బహ్రైచ్, ప్రతాప్గఢ్, ప్రయాగ్రాజ్, శ్రావస్తి మరియు సుల్తాన్పూర్లోని 11 జిల్లాల్లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఐదవ దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23న ఓటింగ్ జరిగిన రాయ్ బరేలీ జిల్లాలో ఒక స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరుగుతుంది. మొత్తం ఐదవ విడతలో పోటీ చేస్తున్న 685 మంది అభ్యర్థుల్లో 246 మంది అభ్యర్థులు కోటీశ్వరులు అని విశ్లేషణ పేర్కొంది. వారు కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. ఇక వీరి శాతం దాదాపు 36 శాతం గా ఉందని వెల్లడించింది.
84 మంది అభ్యర్థులు రూ. 5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉండగా, 90 మంది రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. 150 మంది అభ్యర్థులు రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లుగా వెల్లడించింది. ఐదవ దశలో పోటీలో ఉన్న అత్యంత ధనవంతులైన ముగ్గురు పోటీదారులు అందరూ అధికార బీజేపీ అభ్యర్థులు అని ఏడిఆర్ విశ్లేషణ తెలిపింది. తిలోయ్ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మయాంకేశ్వర్ శరణ్ సింగ్ ఆస్తుల విలువ రూ. 58 కోట్లుగా పేర్కొంది.
ఆయన తర్వాతి స్థానాల్లో కుందా నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సింధుజా మిశ్రా సేనాని 52 కోట్లకు పైగా ఆస్తులతో, అమేథీ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంజయ్ సింగ్ రూ. 50 కోట్లకు పైగా ఆస్తులతో ఉన్నారని వెల్లడించింది. ప్రయాగ్రాజ్లోని ప్రతాపూర్కు చెందిన స్వతంత్ర అభ్యర్థి హీరా మణి అత్యల్ప ఆస్తులు కేవలం రూ. 8,000 కాగా, ప్రయాగ్రాజ్లోని మెజాకు చెందిన ఎల్జేపీకి చెందిన హైదర్ అబ్బాస్ రూ. 8,900 ఆస్తులను ప్రకటించారు. బారాబంకిలోని కుర్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థి సంతోష్ కుమార్ తన అఫిడవిట్లో రూ.11,100 ఆస్తులను ప్రకటించారు.