పొత్తుపై రగడ: అఖిలేష్ అర్డునుడు, రాహుల్ కృష్ణుడు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ మధ్య ముందస్తు పొత్తు కుదురుతుందన్న అంచనాల మధ్య వారణాసిలో మరోసారి ముందే పోస్టర్లు వెలిశాయి.
న్యూఢిల్లీ/ లక్నో/ వారణాసి: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ మధ్య ముందస్తు పొత్తు కుదురుతుందన్న అంచనాల మధ్య వారణాసిలో మరోసారి ముందే పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీని క్రుష్ణుడిగా, ఉత్తరప్రదేశ్ సిఎం అఖిలేశ్ యాదవ్ను అభివర్ణిస్తూ పోస్టర్లు వేశారు. బాణాలు సంధిస్తున్నఅర్జునుడిలా అఖిలేశ్ యాదవ్, రథ సారధిగా వ్యవహరిస్తున్న క్రుష్ణుడిగా రాహుల్గాంధీ ఊహిస్తూ ఈ పోస్టర్లు రూపొందించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదురుతుందన్న వార్తలకు మద్దతు తెలుపుతూ ఈ పోస్టర్లు వెలుస్తున్నాయి.
సమాజ్ వాదీ ఎన్నికల చిహ్నం 'సైకిల్' గుర్తుతోపాటు 'వికాస్ సే విజయ్ కీ ఓర్ చలే డో మహారథి' అనే నినాదం కూడా ముద్రించారు. వారణాసి నగరంలోని బెనియాబాగ్, చేత్గంజ్ తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అతికించారు. తాజా వార్తాకథనాల ప్రకారం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తుపై సంశయం నెలకొన్నదన్న వార్తల నేపథ్యంలో వారణాసిలో పొత్తును ఆకాంక్షిస్తూ పోస్టర్లు వెలువడటం గమనార్హం. శనివారం నుంచి తొలి దశ నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలోనూ పార్టీ అభ్యర్థుల జాబితాను ఖరారుచేసేందుకు కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఇంకా సమావేశం కానేలేదు.
రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావడానికి కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. సమాజ్ వాదీ పార్టీతో సంప్రదింపుల కోసం ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్, యుపిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్ శుక్రవారమే లక్నో బయలుదేరి వెళ్లారు. ఏడు దశల పోలింగ్ ప్రక్రియలో తొలి దశ వచ్చేనెల 11న పోలింగ్ జరుగనుండటం గమనార్హం.
అఖిలేశ్ కఠిన వైఖరి
తొలి దశలోనే అజిత్ సింగ్ అధ్యక్షతన గల రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ (ఆర్ఎల్డి)తో పొత్తు అవకాశాలకు తలుపులు మూసేసిన అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో కఠిన వైఖరి ప్రదర్శిస్తోంది. 191 స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటించిన ఎస్పీ నాయకత్వం హస్తం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టివేసింది. తత్ఫలితంగా మహా కూటమి ఏర్పాటుపై నీలి నీడలు ఏర్పడ్డాయి.
సిఎల్పీ నేత స్థానానికి ఎస్పీ అభ్యర్థి
తొలి మూడు దశల్లో 209 స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 స్థానాలు మాత్రమే వదిలేసిన ఎస్పీ.. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలకూ టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేత ప్రదీప్ మాథూర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మథుర స్థానానికీ అభ్యర్థిని ప్రకటించింది.
అమేథీ అసెంబ్లీ సీటుపైనా ఎస్పీ కన్ను
రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి లోక్ సభ స్థానం పరిధిలోని అమేథి అసెంబ్లీ సెగ్మెంట్ పైనా సమాజ్ వాదీ పార్టీ కన్ను పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే స్పందించినట్లు తెలుస్తున్నది. ఎస్పీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలను తాము కోరడం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు ఇమ్రాన్ మసూద్కు బలమైన సహరాన్ పూర్ జిల్లాలోని ఏడు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించడం గమనార్హం. దేవ్ బంద్ నుంచి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మావియా అలీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తలుపులు మూసుకోలేదన్న కిరణ్మయి నందా
తొలి జాబితా ప్రకటించిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎస్పీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల పొత్తుకు తలుపులు మూసుకోలేదదన్నారు. కాంగ్రెస్ పార్టీకి 85 స్థానాలకు కేటాయించేందుకు తాము సిద్ధమన్నారు. కానీ హస్తం పార్టీ 100 స్థానాలకు కోరుతున్నదన్నారు. తొలి దశలో 18 స్థానాలు కేటాయించామని, మరో 54 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ పొందగలదన్నారు.
ఎన్నికల పొత్తుపై
ఎన్నికల పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నుంచి సానుకూల సంకేతాలు లభించలేదన్నారు. బిజెపిని అడ్డుకోవాలన్న సంకల్పం ఉంటే కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన స్థానాల నుంచి ఆర్ఎల్ డికి ఇచ్చుకోవచ్చునన్నారు. పొత్తు పట్ల కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉంటే మరో 25 - 30 స్థానాలు కేటాయించగలమన్నారు నందా. పొత్తు కుదిరితే కాంగ్రెస్ పార్టీ స్థానాల నుంచి తాము అభ్యర్థులను ఉపసంహరించుకుంటామన్నారు.
నందా వ్యాఖ్యలతో విభేదించిన ఎస్పీ
కాంగ్రెస్ పార్టీకి 85 స్థానాలు మాత్రమే కేటాయిస్తామన్న తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కిరణ్మయి నందా ప్రకటనతో తనకు సంబంధం లేదని సమాజ్ వాదీ పార్టీ వివరణ ఇచ్చింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తుది నిర్ణయం తీసుకుంటారని ట్వీట్ చేసింది. పొత్తుపై రెండు పార్టీల మధ్య చర్చల వివరాలు అఖిలేశ్ తెలుసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఆత్మ గౌరవాన్ని పణంగా పెట్టలేమన్న రాజ్ బబ్బర్
సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కోసం తమ పార్టీ ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టలేమని ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న సంగతి తెలియదన్నారు. తమది జాతీయ పార్టీ అని, కార్యకర్తల మనోభావాలను విస్మరించలేమన్నారు.
బిఎస్పీ గూటికి అంబికా చౌదరి
అఖిలేశ్ యాదవ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత అంబికా చౌదరి ఆ పార్టీని వీడారు. పార్టీలోని అన్ని స్థానాలకు రాజీనామాచేస్తున్నట్లు శనివారం ట్వీట్ చేశారు. ఇక నుంచి తాను బీఎస్పీతోనే కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్ మధ్య పార్టీ ఆధిపత్య పోరు నేపథ్యంలో అంబికా చౌదరి నేతాజీ పక్షాన నిలిచిన సంగతి తెలిసిందే.