లోక్సభ ఎన్నికలకు ముందు రిజర్వేషన్లపై కొత్త ఫార్ములతో యోగీ సర్కార్
ఇతర వెనకబడిన తరగతులకు ఇచ్చిన రిజర్వేషన్ కోటాను యూపీ సర్కార్ విభజించే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఇలా చేయడం వల్ల ఇతర వర్గాల వారిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చని యోగీ సర్కార్ భావిస్తోంది. యోగీ సర్కార్లో మంత్రిగా ఉన్న ఓం ప్రకాష్ రాజ్భర్ కూడా రిజర్వేషన్లపై బాహాటంగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. రిజర్వేషన్ కోటాను విభజించాలని చెబుతూ వస్తున్నారు రాజ్భర్.
రిజర్వేషన్ పై డిమాండ్ చేస్తున్న మంత్రి ఓంప్రకాష్ రాజ్భర్
రిజర్వేషన్ల విభజన పై రాజ్భర్ యూపీ సర్కార్కు 100 రోజుల అల్టిమేటం కూడా ఇచ్చారు. 100 రోజుల్లో ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇవ్వకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి బీజేపీతో తెగదెంపులు చేసుకుంటానని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్లలో విభజన జరిగితే యాదవ్ కుమ్రి సామాజిక వర్గాల వారికి నిరాశ కల్గించినట్లు అవుతుంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో తప్ప విద్యావకాశాల్లో వారికి రిజర్వేషన్ల వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు.
27 శాతం ఓబీసీ కోటాను మూడుగా విభజించే ఛాన్స్
ఒకవేళ రిజర్వేషన్లపై విభజన చేస్తే కుమ్రి సామాజిక వర్గం గురించే బీజేపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల అమలు ఇందుకోసమే జాప్యం అవుతోందని ఇప్పటికే యోగీ ఆదిత్యనాథ్ దగ్గర ఫైలు ఉన్నట్లు తెలుస్తోంది. అప్నాదల్ సోనేలాల్ పార్టీతో చర్చలు జరిపాకే రిజర్వేషన్ల అమలు ఓ కొలిక్కి రానున్నట్లు సమాచారం. ఇక రిజర్వేషన్లపై రిపోర్టును ఫిబ్రవరిలో అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టనుంది. ఓబీసీలకు ఉండే 27 శాతం రిజర్వేషన్ మూడు భాగాలుగా విభజించాలని రిపోర్టులో సూచించినట్లు సమాచారం. వెనకబడిన వర్గాలు, మరింత వెనకబడిన వర్గాలు, అత్యంత వెనకబడిన వర్గాలుగా విభజించి రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తోంది. వెనకబడిన వర్గాల వారికి 7శాతం, మరింత వెనకబడిన వర్గాల వారికి 11 శాతం, అత్యంత వెనకబడిన తరగతుల వారికి 9శాతం రిజర్వేషన్ ఇవ్వాలని యోగీ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. ఈ రిజర్వేషన్ ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తే యాదవేతర ఓబీసీలు తమకు దగ్గరవుతారని బీజేపీ బలంగా విశ్వసిస్తోంది.
ఓబీసీలు, ఇతర అగ్రకులాల మద్దతు ఎవరికి..?
బీఎస్పీ-ఎస్పీ పొత్తుతో యాదవులు మరియు జాతవుల మద్దతు ఉంటుందని కాంగ్రెస్కు ముస్లిం మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అలాంటి పరిస్థితి తలెత్తితే వెనకబడిన వర్గాల వారు, జాతవేతర వర్గాల వారు, అగ్రకులాల వారు బీజేపీకి మద్దతుగా నిలిస్తే 75 స్థానాలను ఉత్తర్ప్రదేశ్లో గెలుస్తుందని వెల్లడించారు. ఇదే ఎస్పీ బీఎస్పీలకు సమాధానంగా నిలుస్తుందని వారిని ఒకరకంగా ఇరుకున పెడుతుందని ఆ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.