కరోనా లాక్డౌన్: జగన్ బాటలో యోగి.. వలస కూలీలకు బిగ్ రిలీఫ్.. ఎక్కడున్నా తీసుకొస్తామంటూ..
''పేదరికం కంటే పెద్ద రోగం ఉందా? అయినవాళ్లకంటే పెద్ద అండ ఉందా? కష్టకాలం ఇంటికాడ ఉంటే సారు.. కలిసిమెలసి కలోగంజో తాగేటోళ్లం.. బస్సులొద్దు బండ్లు వద్దు అయ్య సారు.. విడిచి పెడితే నడిచి నేను పోత సారు..'' అంటూ వలసకూలీల వెతలపై రూపొందిన ఓ పాట తెలుగునాట వైరలైంది. నిజానికి ఆ పాటతో సంబంధం లేకున్నా ఇద్దరు ముఖ్యమంత్రులు వలస కూలీల దైన్యంపై ఉదారంగా స్పందించారు. ఏపీ సీఎం జగన్.. గుజరాత్ లో చిక్కుకుపోయిన మత్స్యకారుల్ని తీసుకొచ్చేప్రయత్నాలు చేస్తుండగా, ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ కూలీలను తీసుకెళతామని సంచలన ప్రకటన చేశారు.

అందరినీ రప్పించేందుకు..
లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత అందరికంటే దారుణంగా ఇబ్బందిపడింది వలస కూలీలే అనడంలో ఎలాంటి సందేహంలేదు. లాక్ డౌన్ మొదలైన తొలినాళ్లలో దేశ రాజధాని ఢిల్లీ నుంచి లక్షల మంది పేదలు పిల్లాపాపలతో సొంత ఊళ్లకు నడిచివెళ్లిన దృశ్యాలు మనందరికీ కంటతడిపెట్టించాయి. ఆ సందర్భంలో కొద్దిగా ఆలస్యంగానైనా, 1000 బస్సులు ఏర్పాటు చేసిన యూపీ సీఎం యోగి, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలు అందరినీ సొంత ప్రాంతాలకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. శుక్రవారం లక్నోలో జరిగిన హైలెవల్ మీటింగ్ లో ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీచేశారు.

దశలవారీగా..
యూపీ నుంచి వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లి, లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన కూలీల జాబితాను సిద్ధం చేయాలని, వాళ్లందరినీ దశలవారీగా సొంత జిల్లాలకు తీసుకురావాలని యోగి నిర్దేశించారు. ఆయా ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలను పంపేలా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు మొదలుపెట్టాలని అధికారులకు సూచించారు. కూలీలను వాళ్ల సొంత జిల్లాలకు తరలించి, అక్కడ ఓ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి, ఆ గడువు ముగిసిన వెంటనే ఒక్కొక్కరికీ రూ.1000 నగదు, రేషన్ సరుకుల కిట్స్ చేతికిచ్చి, ఇళ్లలో వలిపెట్టేలా ప్రణాలికలు సిద్దం చేయాలన్నారు.

జరిగే పనేనా?
ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కూలీలను తీసుకెళ్లేందుకు యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ప్రాక్టికల్ గా ఇది సాధ్యమయ్యే పనేనా? లాక్ డౌన్ కఠినంగా అమలవుతోన్న వేళ కూలీలను పంపేందుకు ఆయా రాష్ట్రాలు అంగీకరిస్తాయా? అనే అనుమానాలు వ్యక్తవముతున్నాయి. యూపీ తన ప్రజల్ని వెనక్కి తీసుకెళితే, మిగతా రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు కూడా తమ ప్రభుత్వాలను ఇదేరకమైన డిమాండ్ చేసే అవకాశం లేకపోలేదు. నిజానికి వలస కూలీలు, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయినవాళ్ల విషయంలో యూపీ సీఎం.. మిగతా ముఖ్యమంత్రులకంటే చాలా ఉదారంగా వ్యవహరించారు. చదువుల కోసం కోటా(రాజస్తాన్)లో చిక్కుకుపోయిన విద్యార్థుల్ని సైతం ఆయన ఇళ్లకు తరలించేశారు.

యూపీలో పెరిగిన కేసులు..
ఉత్తరప్రదేశ్ లో శుక్రవారం కూడా కొత్తగా 94 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1604కు పెరిగింది. అందులో 206 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 24 మంది చనిపోయారు. 20 కోట్లపైచిలుకు జనాభాతో దేశంలోనే అది పెద్ద రాష్ట్రంగా కొనసాగుతోన్న యూపీలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. మిగతా రాష్ట్రాల కంటే ముందే క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా వైరస్ వ్యాప్తి ఉదృతిని తగ్గించగలిగారు. కరోనా కట్టడితోపాటు ఇతర రాష్ట్రాల్లో చిక్కుపోయినవాళ్లను తీసుకొచ్చే విషయంలోనూ రాష్ట్రం ఉదారంగా వ్యవహరిస్తున్నది. 20 కంటే ఎక్కువ కేసులున్న జిల్లాలకు ఇద్దరు చొప్పున సీనియర్ అధికారుల్ని పంపి, రెండు వారాలపాటు వాళ్లు అక్కడే ఉంటూ లాక్ డౌన్ అమలును పర్యవేక్షించాలనీ సీఎం యోగి ఆదేశించారు.

యూపీ కంటే ముందు ఏపీ..
ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమవారిని తీసుకెళ్తామంటూ యూపీ ప్రభుత్వం ప్రకటన చేయడానికి రెండ్రోజుల ముందు.. ఏపీలోని జగన్ సర్కారు సైతం అదే పని చేసింది. కరోనా లాక్డౌన్తో గుజరాత్లోని వీరావల్లో చిక్కుకుపోయిన ఐదు వేల మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు మత్స్యకారులను సముద్ర మర్గం ద్వారా సొంత ప్రాంతాలకు తీసుకురావలని సీఎం జగన్ ఆదేశించారు. గుజరాత్ సీఎం రూపానీతో ఫోన్ లో చర్చల అనంతరం ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరి ఏపీలో చిక్కుకుపోయిన యూపీ కూలీలపై జగన్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.












Click it and Unblock the Notifications