గౌరవం?: పెళ్లైనా ప్రియుడిని కలుస్తోందని.. ప్రియుడితోపాటు కూతుర్నీ చంపేశాడు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి.. తన 19 ఏళ్ల కుమార్తెతో పాటు ఆ యువకుడిని దారుణంగా హత్య చేశాడో తండ్రి.
కాన్పూర్: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి.. తన 19 ఏళ్ల కుమార్తెతో పాటు ఆ యువకుడిని దారుణంగా హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన మహోబా జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుల్పాహార్ ప్రాంతానికి చెందిన నిందితుడు మూల్చంద్ అహిర్వార్ను అరెస్ట్ చేశారు. విచారణలో కుటుంబ గౌరవం కోసమే ఈ హత్య చేసినట్లు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.
కుల్పాహార్ సర్కిల్ అధికారి వినోద్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూల్చంద్ కుమార్తె గీతా అహిర్వార్కు గత శనివారం వివాహం జరిగింది. కాగా, గత సంవత్సరం ఝాన్సీలో బంధువుల శుభకార్యానికి వెళ్లిన గీతకు అక్కడ చెందిన సునీల్తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారిద్దరూ తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు.
ఈ విషయం ఆమె తండ్రి మూల్చంద్కు తెలిసింది. తన కుమార్తెకు ఇప్పటికే వివాహం నిశ్చయం అయిందని ఇక నుంచి కలుసుకోవద్దని సునీల్ను మూల్చంద్ హెచ్చరించాడు. అయినా గీత వివాహం తర్వాత కూడా సునీల్ కలిశాడు. ఆదివారం అర్థరాత్రి మూల్చంద్ లేని సమయంలో గీతను కలిసేందుకు సునీల్ వెళ్లాడు. వారిద్దరూ మాట్లాడుకోవడం సోమవారం వేకువజామున మూల్చంద్ చూశాడు.
పట్టలేని ఆగ్రహంతో గొడ్డలితో సునీల్, గీతలపై దాడి చేసి హత్య చేశాడు. నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారని, గదిలో హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వినోద్ సింగ్ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.