రెండు రకాల రేప్లు, అంగీకారంతోనే!: యూపీ మంత్రి, దుమారం
లక్నో: ఉత్తర ప్రదేశ్ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు, అబ్బాయిల పరస్పర అంగీకారంతోనే అత్యాచారాలు జరుగుతుంటాయంటూ మంత్రి తోతారామ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి కారణమయ్యాయి.
శనివారం మెయిన్పురి జిల్లా కారాగారాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యాచారం అంటే ఏమిటి? అలాంటిదేమీ లేదని, పరస్పర ఆమోదంతోనే అవి జరుగుతాయని పేర్కొన్నారు. బలవంతంగా జరిగేవి, ఆమోదంతో జరిగేవి అనే రెండు విభాగాలుగా అత్యాచారాలను విభజించవచ్చని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచారాలను నియంత్రించడంపై విలేకరులు ప్రశ్నలు అడిగారు. దీంతో ఆయన విచిత్రంగా స్పందించారు. రేప్లు రెండు రకాలు అని, ఒకటి బలవంతంగా చేసేవి, రెండు పరస్పర అంగీకారంతో జరిగేవనగా.. దీనిపై విలేకరులు వివరణ కోరారు.
దానిపై వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. కొద్ది నెలల క్రితం సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అత్యాచారాల పైన మాట్లాడుతూ.. కుర్రాళ్లు అన్నాక తప్పు చేస్తారని వ్యాఖ్యానించారు.