యూపీలోనూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు: 30వేలకుపైగా కొత్త కేసులు, 100కుపైగా మరణాలు
లక్నో: మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, 30వేలకుపైగా పాజిటివ్ కేసులు ఒక్కరోజు వ్యవధిలోనే నమోదు కావడం కలవరపెడుతోంది. కరోనా మహమ్మారి కేసులు ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 30,596 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,91,457కి చేరింది. యూపీ రాజధాని లక్నోలో గత 24 గంటల్లో అత్యధికంగా 5551 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో 129 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 9830కి చేరింది. గత 24గంటల్లో ఒక్క లక్నోలోనే 22 మరణాలు సంభవించాయి. ప్రయాగ్ రాజ్, వారణాసిలో పది మంది చొప్పున మృతి చెందారు.

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం లాక్డౌన్ విధించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం పూర్తిగా లాక్డౌన్ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది.
అంతేగాక, రాష్ట్రంలో ఎవరైనా మాస్కు లేకుండా బయట తిరిగితే వారి నుంచి రూ. 1000 జరిమానా వసూలు చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి కూడా మాస్కు లేకుండా పట్టుబడితే రూ. 10వేల జరిమానా వసూలు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
కాగా, గత 24 గంటల్లోనే దేశ వ్యాప్తంగా 2.61 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1501 మరణాలు సంభవించాయి. దేశ వ్యాప్తంగా కొత్త నమోదవుతున్న కరోనా కేసులు ఎక్కువగా పది రాష్ట్రాల్లోనే ఉంటున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 78.56 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 18 లక్షలకుపైగా యాక్టివ్ కేసులున్నట్లు వెల్లడించింది.












Click it and Unblock the Notifications