ముజఫర్ ఘర్షణలు: పక్కన పెట్టాలని జయప్రద హితవు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరిగిన మతఘర్షణలు దురదృష్టకరమని, ఇలాంటి ఘర్షణలను ఏ పార్టీ కూడా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోరాదని రాష్ట్రీయ లోక దళ్ నేత, ప్రముఖ నటి జయప్రద అ్నారు. మత ఘర్షణల అంశాన్ని ఏ పార్టీ కూడా ఓట్లురాల్చుకునేందుకు ఉపయోగించుకోవద్దని హితవు పలికారు.
జయప్రద ఇటీవలె ఆర్ఎల్డీ పార్టీలో చేరారు. ఆమెకు బిజ్నోర్ లోకసభ టిక్కెట్టును ఆ పార్టీ కేటాయించింది. ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇలాంటి సంఘటనలను ఓట్ల కోసం ఉపయోగించుకోవద్దని పార్టీలను కోరారు.
మత ఘర్షణల వంటి అంశాలకు బదులు రైతుల సమస్యలను, వారి సంక్షేమం, అభివృద్ధి అంశాలను అజెండాగా తీసుకోవాలని కోరారు. గత ఏడాది జరిగిన మత ఘర్షణల ద్వారా కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది సరికాదన్నారు.
జయప్రద గురువారం సాయంత్రం మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్ లోకసభ స్థానం నుండి ఆమె రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన జయప్రద.. ఆ తర్వాత యూపిలోని సమాజ్ వాది పార్టీలో చేరింది. ఎస్పీ నుండి అమర్ సింగ్తో పాటు బయటకు వచ్చారు. ఇటీవల ఆర్ఎల్డీలో చేరారు.