మహిళల దుస్తులు పురుషులు కుట్టొద్దు-హెయిర్ కట్ చేయొద్దు-మహిళా కమిషన్ షాకింగ్..!
ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నియమించిన మహిళా కమిషన్ పురుషులకు భారీ షాకిచ్చింది. రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించేందుకు సంచలన ప్రతిపాదనలు చేసింది. మహిళలతో లింక్ అయ్యే పనుల్లో పురుషులను దూరం పెట్టాలంటూ మహిళా కమిషన్ చేసిన ప్రతిపాదనలు కలకలం రేపుతున్నాయి. వీటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పురుషులు ఇకపై స్త్రీల బట్టలు కుట్టకుండా దూరంగా ఉండాలని, వారి స్ధానంలో మహిళలే వారి దుస్తులు కుట్టాలని మహిళా కమిషన్ ప్రతిపాదిస్తోంది. అలాగే పురుషులు స్త్రీల జట్టును హెయిర్ సెలూన్లలో కత్తిరించకూడదని కూడా ప్రతిపాదించింది.యూపీలో మహిళల్ని బ్యాడ్ టచ్ (చెడుగా తాకడం) నుంచి రక్షించేందుకు ఈ ప్రతిపాదనలు చేసినట్లు మహిళా కమిషన్ తెలిపింది. అక్టోబర్ 28న జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది..

యూపీ మహిళా కమిషన్ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనల ప్రకారం ఇకపై మహిళల దుస్తులు కుట్టేందుకు కొలతలు తీసేందుకు పురుషులను అనుమతించకూడదు. అలాగే సీసీటీవీల నీడలోనే మహిళలు మహిళల దుస్తుల కొలతలు తీసుకోవాలని కూడా ప్రతిపాదించింది. మహిళా టైలర్లు మాత్రమే మహిళలు ధరించే బట్టల కొలతలు తీసుకోవాలని కమిషన్ చెబుతోంది. ఈ ప్రతిపాదనల్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ బబితా చౌహాన్ తెరపైకి తెచ్చారని, సభ్యులు సమర్థించారని తెలుస్తోంది.
ఇవి ప్రస్తుతానికి ప్రతిపాదన మాత్రమేనని, దీనికి సంబంధించి చట్టాలు చేయాలని మహిళా కమిషన్ ప్రభుత్వాన్ని కోరనుంది.












Click it and Unblock the Notifications