సర్వేలపై సర్వేలు.. గుజరాత్ లో బీజేపీ ఓటమి??
దేశంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి, దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ వైరం రోజురోజుకు కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇరుపార్టీల నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. బీజేపీకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందని, అందుకు దాదాపు రూ.800 కోట్లు ఖర్చుచేయడానికి సిద్ధపడిందని, అంత డబ్బు ఆ పార్టీకి ఎక్కడినుంచి వస్తోందని అరవింద్ ప్రశ్నించారు.

బలపరీక్ష నిరూపించుకున్న కేజ్రీవాల్
తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపించిన కేజ్రీవాల్ తానే స్వయంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి బలపరీక్ష జరిపారు. అందులో నెగ్గారు. బీజేపీ చెబుతున్నవన్నీ అవాస్తవాలని, తమ ఎమ్మెల్యేలంతా ఆప్లోనే ఉన్నారనేదానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసిన ఆప్ తాజాగా గుజరాత్ ఎన్నికలపై దృష్టిపెట్టింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వరాష్ట్రం కావడంతో ఇక్కడ ఎలాగైనా జెండా ఎగరవేయాలనే లక్ష్యంతో ఉంది. తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తోంది.

మోడీకి సమాధానం చెప్పాలనే పట్టుదలతో..
ఈ ఏడాది చివరలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఎలాగైనా అక్కడ గెలిచి మోడీకి గట్టి సమాధానం చెప్పాలనే పట్టుదలతో కేజ్రీవాల్ ఉన్నారు. రాజ్కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సూరత్లో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలకు ఏడు స్థానాలు ఆప్ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని వెల్లడించారు. మీరు ఐటీ అంటూ, ఈడీ అంటూ, సీబీఐ అంటూ భయపెడితే భయపడటానికి తాము కాంగ్రెస్ నాయకులం కాదంటూ మండిపడ్డారు. సర్వేలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, అందుకే తమ నేతలపై దాడులు జరుగుతున్నానే విషయాన్ని ప్రజలు గుర్తెరగాలన్నారు.

తమ పార్టీలో ఉన్నవారంతా భగత్ సింగ్ లే..
తామంతా సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్ వారసులమని బీజేపీపై కేజ్రీవాల్ మండిపడ్డారు. ఓడిపోతామని సమాచారం అందుకున్నారు కాబట్టే కుట్ర రాజకీయాలకు ఆ పార్టీ తెరతీసిందని నిప్పులు చెరిగారు. ఆప్ నేత మనోజ్ సోరథియాపై దాడిని ప్రస్తావించారు. మనోజ్పై దాడి జరగడాన్ని సూరత్ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారని, బీజేపీ గుండాలు దాడి చేశారనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. గుజరాత్లోని ఆరు కోట్ల మంది ప్రజలు ప్రధాని మోడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఒక రాజకీయ నాయకుడిపై దాడి చేయడం భారతదేశ సంస్కృతి కాదని, అందులో అది అసలు గుజరాత్ సంస్కృతి కాదంటూ వ్యాఖ్యానించారు. గుజరాత్ ఎన్నికలపై సర్వేలు బీజేపీకి అనుకూలంగా రావడంలేదని, ఆ పార్టీ ఓటమి పాలవుతుందని, ఆప్కే పీఠం దక్కనుందంటూ సర్వేల్లో తేలిందని, అందుకే తమ నేతలపై ఈడీ దాడులంటూ భయపెట్టడానికి చూస్తున్నారని, తమ పార్టీ నేతలు దేనికీ తలవంచేవారు కాదనే విషయాన్ని మోడీ గుర్తెరగాలని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications