సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల, ఫిబ్రవరిలో పర్సనాలిటీ టెస్ట్: 100మంది దాకా తెలుగు అభ్యర్థులు!
న్యూఢిల్లీ: సివిల్స్ 2017 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్స్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. గత ఏడాది అక్టోబర్ 28 నవంబర్ 3 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
యూపీఎస్సీ నిర్వహించిన 2017 సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష ఫలితాలను కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నెంబర్లను www.upsc.gov.in లో చూసుకోవచ్చు.
అర్హులకు ఫిబ్రవరి 19 నుంచి పర్సనాలిటీ టెస్ట్
ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు స్టేజీలలో సివిల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులకు ఫిబ్రవరి 19న ఇంటర్వ్యూలను (పర్సనాలిటీ టెస్ట్)లను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూ లెటర్ను ఈ నెల 18వ తేదీ తర్వాత వెబ్సైట్లో అభ్యర్థులు డౌన్లౌడ్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయస్సు, విద్యార్థుల సర్టిఫికెట్లు, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండీక్యాప్ వంటి ఇతర ఒరిజినల్ డాక్యుమెంట్లను పట్టుకొని రావాల్సి ఉంటుందని యూపీఎస్సీ తెలిపింది.
అర్హత సాధించని అభ్యర్థుల మార్కులు ఆ తర్వాత
సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో అర్హత సాధించలేని అభ్యర్థుల మార్కుల షీట్స్ను ఇంటర్వ్యూలు పూర్తయి తుది ఫలితాలు వెల్లడించిన 15 రోజుల లోపు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతారు. కమిషన్ వెబ్సైట్లో ఈ మార్కుల షీట్స్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల నుంచి వందమంది వరకు
ఇదిలా ఉండగా, ఈ పరీక్షల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది వరకు ఉత్తీర్ణయినట్లుగా తెలుస్తోంది. వీరు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నారు. సుమారు వెయ్యి ఉద్యోగాలకు 2565 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా పది లక్షల మంది దరఖాస్తు చేసినప్పటికీ వారిలో ఆరు లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13,366 మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది పరీక్ష రాశారు.