ఒబామా రాక: నరేంద్రమోడీ ఏం చెప్తారు? అమెరికా కంపెనీల ఉత్కంఠ
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్ - అమెరికా బిజినెస్ కౌన్సెల్ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా మాట్లాడనున్నారు. అయితే, మోడీ మాట్లాడే విషయమై అమెరికాకు చెందిన బిజినెస్ కంపెనీల ప్రముఖులు ఆసక్తితో ఉన్నారు.
మోడీ ఏం మాట్లాడతారు? సంస్కరణల కోసం ఏం చేస్తారు? ఆయన చెప్పే ట్యాక్స్ స్టక్చర్ ఎలా ఉండనుంది? వ్యాపారాల కోసం ఇచ్చే భూసేకరణకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి? తదితర అంశాలపై మోడీ ఏం చెబుతారనే విషయమై వారు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారంటున్నారు. 'మేక్ ఇన్ ఇండియా' విషయమై మరింత క్లారిటీగా తెలుసుకోవాలని చూస్తున్నారు.
మెక్గ్రాహిల్ ఫైనాన్షియల్ చైర్మన్ హోరాల్డ్ మెక్గ్రా, పెప్సికో చైర్ పర్సన్ ఇంద్రానూయి, మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్ అజయ్ బంగా తదితరులు బరాక్ ఒబామాతో పాటు రానున్న ఆదివారం నాడు భారత్ రానున్నారు. ఈ సమయంలో మోడీ, ఒబామాలు యుఎస్ వ్యాపార ప్రముఖులు, అధినేతలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ప్రారంభ సమావేశం ఇటీవలె పునరుద్ధరించిన భారత్-యూఎస్ సీఈవో ఫోరంది కానుంది. హానీవెల్ చైర్మన్ డేవిడ్ కోట్, టాటా సన్స్ కౌంటర్ పార్ట్ సైరస్ మిస్ట్రీలు ఇందులో పాల్గొంటారు. స్మార్ట్ సిటీ, ఉమ్మడి రక్షణ ఉత్పత్తి, భారత్లో తయారీ, మౌలిక సదుపాయాలు తదితర అంశాల పైన ప్రముఖంగా మాట్లాడనున్నారు. 2020 నాటికి 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం లక్ష్యంగా ముందుకు సాగనున్నారు.
కాగా, బరాక్ ఒబామా పర్యటన నేపథ్యంలో కనివినీ ఎరగని రీతిలో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ పథ్ వద్ద వీవీఐపీ ఆవరణం చుట్టు ఏడంచెల భద్రత వలయాన్ని, గగనతల పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాడర్ ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై ఒబామా రెండు గంటలకు పైగా ఉండబోతున్నందున అమెరికా, భారత భద్రతాధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒబామాకు అంగరక్షక దళం ఇది... వివిధ విభాగాధిపతులు 12 మంది అమెరికా అధ్యక్షుడి చుట్టూ ఉండి కాపలా కాస్తుంటారు. వీరి సిబ్బంది 1600 మంది ఉంటారు. ఎన్నో అంచెల్లో భద్రతను పర్యవేక్షిస్తుంటారు. తాజా భద్రతా ఏర్పాట్లకు.. మొత్తం 15,000 కొత్త సీసీటీవీ కెమెరాలను ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
వీటిలో 100 కెమెరాలు ముఖాలను గుర్తిస్తాయి. వీటిలో ఉగ్రవాదులు, అనుమానితుల ఫొటోలు ఫీడ్ చేసి ఉంటాయి. ఆ ముఖాలను పోలినవి కనబడితే.. సిబ్బందికి ఇవి సంకేతాలిస్తాయి. ఇలాంటివి.. రాజ్పథ్ మార్గంలో, విమానాశ్రయాల్లో, రైల్వేస్టేషన్లలో, బస్టాండులలో ఏర్పాటు చేశారు. రాజ్పథ్ మీదుగా కొంత భాగాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించారు.