తెలుగు టెక్కీలపై కాల్పులు: అమెరికా ఖండన, ‘ట్రంపే కారణం’
కన్సాస్లో జరిగిన జాతి విద్వేష కాల్పులను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని తెలిపింది.
న్యూఢిల్లీ/న్యూయార్క్: కన్సాస్లో జరిగిన జాతి విద్వేష కాల్పులను భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఖండించింది. ఈ ఘటనపై తమ దేశ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని అమెరికా రాయబార కార్యాలయం అధికారి మ్యారీకే ఎల్ కార్లసన్ వెల్లడించారు. కేసుపై వేగంగా దర్యాప్తు జరుపుతుందని తెలిపారు.
ఈ ఘటనలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. గాయపడిన మేడసాని అలోక్ ఇంటికి భారత కాన్సులేట్ జనరల్ ఆర్డీ జోషి వెళ్లి అతడిని పరామర్శించారు.
ఉగ్రవాదులంటూ కాల్పులు: తెలుగు ఇంజినీర్ మృతి, మరో వ్యక్తికి తీవ్రగాయాలు
అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడికి అవసరమైన సహాయం అందిస్తామని హూస్టన్ లోని భారత రాయబార కార్యాలయ అధికారి అనుమప్ రే హామీ ఇచ్చారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలుగు వ్యక్తి మృతి పట్ల విదేశాంగశాఖ మంత్రి సుస్మా స్వరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి: అలోక్ తండ్రి
కన్సాస్లో దుండగుడి కాల్పుల్లో తన కుమారుడు అలోక్ తొడలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లిందని అతని తండ్రి జగన్మోహన్ తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అలోక్.. కోలుకుంటున్నాడని తెలిపారు. అలోక్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని మేడసాని అలోక్ తండ్రి జగన్మోహన్ సూచించారు.
అమెరికాలో భారతీయులపై ఇటీవల దాడులు పెరిగిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కన్సాస్ లో దుండగుడు జరిపిన కాల్పుల నుంచి తన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడని మీడియాతో చెప్పారు.
మన వాళ్లను రక్షించేందుకు.. కాల్పులకు ఎదురెళ్లి.. ఓ అమెరికా పౌరుడి సాహసం
కన్సాస్లోని ఆస్టిన్ బార్ అండ్ గ్రిల్లో బుధవావారం దుండగుడు ఆడమ్ పూరింటన్ కాల్పులు జరపడంతో తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోయాడు. తమ దేశం విడిచి వెళ్లిపోవాలని శ్రీనివాస్, అలోక్ తో ఆడమ్ వాగ్వాదానికి దిగాడని అలోక్ తండ్రి తెలిపారు.
బార్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆడమ్ ను బయటకు పంపించారని, కొంతసేపటి తర్వాత తిరిగొచ్చిన అతడు తుపాకీతో కాల్పులకు దిగినట్టు వెల్లడించారు. తన కుమారుడు అలోక్ అక్కడి నుంచి పరుగెత్తుకుని వెళ్లిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడని తెలిపారు. అలోక్ క్షేమంగా ఉన్నాడని, అతడితో ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికాతో భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అలోక్ను భారత్కు వచ్చేలా నచ్చజెప్తామని, పిల్లలను అమెరికా పంపే విషయంలో భారతీయులు పునరాలోచించుకోవాలని ఆయన తండ్రి జగన్మోహన్ అన్నారు. హైదరాబాద్ వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదివిన అలోక్ 11ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడే ఎమ్మెస్ చదివి గార్విన్ కంపెనీలో ఏవియేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటింగ్ మేనేజర్గా పని చేస్తున్నారు.
ఇదిలావుంటే, అమెరికాలో తెలుగువారిపై కాల్పుల్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. భారతీయుల పట్ల అమెరికాలో జాత్యంహకార వైఖరి సరైంది కాదని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. ఘటనపై అమెరికాలో భారత రాయబారి నవతేజ్ శర్న తనతో మాట్లాడారని ఆమె తెలిపారు.
సంఘటన జరిగిన వెంటనే దౌత్యాధికారులను అక్కడికి పంపినట్టు ఆమె ట్విట్టర్లో వెల్లడించారు. శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి సుష్మా సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాల్పుల్లో గాయపడిన అలోక్కు మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.
ఈ ఘటనకు ట్రంపే కారణం
This is 1st time it happened to family; Trump is only the primary reason as of now: Kansas shooting victim Srinivas Kuchibhotla's relative pic.twitter.com/gxlv7Lxfzw
— ANI (@ANI_news) February 24, 2017
అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలే ఇలాంటి ఘటనలకు కారణమని శ్రీనివాస్ కూచిబొట్ల బంధువులు పేర్కొన్నారు. దుండగుడి కాల్పుల్లో శ్రీనివాస్ మరణించడానికి ట్రంపే ప్రధాన కారణమంటూ వారు వాపోయారు. తమ కుటుంబంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని చెప్పారు.