మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం: పిల్లలు సహా ఐదుగురు సజీవదహనం
మొరాదాబాద్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్లోని గల్షహీద్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
మంటలు భారీగా ఎగిసిపడగా, దాన్ని ఆర్పేందుకు మూడు గంటల సమయం పట్టింది. అగ్నిమాపక సిబ్బంది భవనంపై నుంచి 12 మందిని రక్షించగలిగారు. వారిలో ఐదుగురు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. వారందరినీ మొరాదాబాద్ నగరంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్చారు.
నలుగురు అక్కడికి చేరుకోగానే మరణించినట్లు ప్రకటించారు. ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. ఈ నివేదికను దాఖలు చేసే సమయంలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నారు.
మొరాదాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర సింగ్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ హేమంత్ కుటియాల్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. భవనం యజమాని ఇంటిలోని మూడు అంతస్తుల్లో తన కుటుంబం నివసిస్తుండగా.. ఇంటి కింది అంతస్తులో స్క్రాప్ మెటీరియల్ను నిల్వ చేశాడు.
గుర్తు తెలియని కారణాలతో స్క్రాప్లో మంటలు చెలరేగాయి. డీఎం మాట్లాడుతూ.. అగ్నిప్రమాదం సంభవించిన ఇంట్లో ముగ్గురు సోదరుల ఉమ్మడి కుటుంబం నివసించింది. ఈ ఘటనలో ఇద్దరు మైనర్ పిల్లలతో సహా ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. ఏడుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటన వెనుక కారణాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఈ మంటలు చెలరేగిన ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం.