బీజేపీ ఎంపీ కుమారుడిపై కాల్పులు: లవ్ మ్యారేజ్: బామ్మర్దితో కలిసి
లక్నో: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోక్సభ సభ్యుడు కౌశల్ కిషోర్ కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన గాయపడ్డారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు రంగంలోకి దిగారు. దుండగుల కోసం జల్లెడ పడుతున్నారు. హైఅలర్ట్ను ప్రకటించారు. వాహనాలను తనిఖీ చేస్తోన్నారు. కాల్పుల ఘటనపై రాజకీయంగా కలకలం చెలరేగింది. దీనికి గల కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంపీ కౌశల్ కిషోర్.. మోహన్లాల్ గంజ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆయన కుమారుడు ఆయుష్.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన ప్రేమ వివాహానికి పెద్దల అంగీకారం లేదు. అయినప్పటికీ- ఇంట్లో వారిని ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. లక్నోలోని భిటౌలీ ప్రాంతంలో నివాసం ఉంటోన్నారు. బుధవారం తెల్లవారు జామున ఆయన తన బావమరిదితో కలిసి వెళ్తోండగా.. లక్నో మడియావా ప్రాంతంలో బైక్పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆయుష్ ఛాతీకి తగిలింది. వెంటనే ఆయనను ట్రౌమా కేర్ సెంటర్కు తరలించారు. అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయుష్ బావమరిది ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనకు కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు చేస్తున్నామని లక్నో నార్త్ జోన్ డీసీపీ రయీస్ అఖ్తర్ తెలిపారు.