అఖిలేష్కు వార్నింగ్: భగ్గుమన్న కుటుంబ కలహాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు బగ్గుమన్నాయి.
ఉత్తర్ ప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార పక్షం సమాజ్ వాదీ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరడంతో రాజకీయ ప్రకంపనలు మొదలైనాయి.
ఎస్పీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కుటుంబంలో చిచ్చు రగిల్చాయి. అందుకు కారణం ములాయం శివలాల్ యాదవ్ అని యూపీ రాజకీయ నాయకులు అంటున్నారు.
శివలాల్ యాదవ్ తాజా ప్రతిపాదన కారణంగా తండ్రి, కుమారుడు (ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్)ల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది.
వచ్చే సంవత్సరం (2017)లో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఓ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకుందామని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సూచించగా ఆయన తిరస్కరించారు.
ములాయం మరో సోదరుడు రామ్ గోపాల్ యాదవ్ సైతం శివలాల్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో తాను రాజీనామా చేస్తానని శివ్ పాల్ యాదవ్ ప్రకటించారు.
ఈ విషయం ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు తెలిసింది. తాను శివ్ లాల్ యాదవ్ ప్రతిపాదనకు మద్దతు ఇస్తున్నానని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు.
పనిలో పనిగా కుమారుడు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మీద మండిపడ్డారు. పార్టీలో నా మాటను కాదని శివలాల్ యాదవ్ ఒక్క అడుగు ముందుకు వెయ్యడని ములాయం సింగ్ యాదవ్ అన్నారు.
అలాంటి వ్యక్తిని పార్టీలోని మీరందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అసలు మీరేమనుకుంటున్నారు ? అని ములాయం సింగ్ యాదవ్ ప్రశ్నించారు. మొత్తం మీద ఎస్పీలో కుటుంబ కలహాల కారణంగా పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి.