లోకల్, నాన్ లోకల్ యూపిలో ఎస్ పి కాంగ్రెస్ కూటమి నినాదం, ప్రచారాన్ని ప్రారంభించిన అఖిలేష్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సుల్తాన్ పూర్ నుండి ఆయన తన ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
లక్నో :స్థానిక యువకులు బయటి ప్రాంతానికి చెందిన మోడీ అనే నినాదంతో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ , సమాజ్ వాదీ పార్టీలు ప్రచారాన్ని నిర్వహించనున్నాయి.ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఎన్నికల్లో స్థానిక యువకులు రాహుల్,అఖిలేష్ యాదవ్ లు, స్థానికేతరుడు మోడీతో సమరానికి సై అంటూ ఎన్నికల నినాదాన్ని తీసుకొంది కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి.
ఎన్నికల్లో బిజెపిని ఢీకొట్టాలంటే స్థానిక, స్థానికేతర అనే నినాదాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుండి ప్రధానమంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
గుజరాత్ రాష్ట్రానికి ,చెందిన మోడీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుండి పోటీచేసి విజయం సాధించాడు.దీంతో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి స్థానిక, స్థానికేతర అనే నినాదాన్ని తీసుకొంది.
స్థానిక అంశాన్ని తెరమీదికి తెచ్చిన సమాజ్ వాదీ, కాంగ్రెస్ కూటమి
లోకల్, నాన్ లోకల్ అనే నినాదాన్ని ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కూటమి ప్రధానంగా ప్రస్తావించనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికిచెందిన అఖిలేష్, రాహుల్ లు, ప్రధానమంత్రి మోడీని స్థానికేతరుడుగా అభివర్ణిస్తున్నారు.ఈ ప్రచారం తమకు కలిసివస్తోందనే అభిప్రాయాన్ని కాంగ్రెస్, ఎస్ పి కూటమి వ్యక్తం చేస్తోంది.
ఎస్ పి. ,కాంగ్రెస్ తరపున యువ నేతల ప్రచారం
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ ,కాంగ్రెస్ పార్టీల కూటమి తరపున ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకులు సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింథియాలు ప్రచారం నిర్వహించనున్నారు.వీరికితోడుగా ప్రియాంక గాంధీ కూడ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 40 మంది తో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను మంగళవారం నాడు విడుదల చేసింది. సినీ నటి నగ్మా సహ పలువురు కూడ ప్రచారం నిర్వహించనున్నారు.అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ కూడ విస్తృతంగా ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
ఎన్నికల ప్రచారాన్ని ప్రారంబించిన అఖిలేష్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సుల్తాన్ పూర్ నుండి తన ప్రచారాన్ని శ్రీకారం చుట్టారు.ఉత్తర్ ప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను సమాజ్ వాదీ పార్టీ ప్రకటించింది.అయితే ఈ జాబితాలో బాబాయ్ శివపాల్ యాదవ్ కు మాత్రం చోటు దక్కలేదు.మంగళవారం నాడు సుల్తాన్ పూర్ నుండి సమాజ్ వాదీ పార్టీ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ములాయం సింగ్ పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు.
బడ్జెట్ లో కూడ మా పథకాలే ప్రకటిస్తారేమో
సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని అంశాలనే బిజెపి ప్రభుత్వం కాపీ కొట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రకటించిన మహిళలు, యువత కోసం అనేక పథకాలు కేటాయించిందన్నారు. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ లో ప్రవేశపెట్టి లబ్దిపొందవచ్చని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మంచి రోజులు ఎప్పుడొస్తాయి
బిజెపికి ఓటేస్తే మంచి రోజులు వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారని, అయితే ప్రజలకు మంచి రోజులు మాత్రం రాలేదని అఖిలేష్ బిజెపిపై నిప్పులు చెరిగారు. మంచిరోజులు రాకపోగా ప్రజలకు చీపురు దక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించకపోగా, యోగా చేయాలని కోరుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.