అఖిలేష్ సంచలనం: 8మంది మంత్రులపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన మంత్రివర్గంలోని 8 మంది మంత్రులపై వేటు వేశారు. ఉద్వాసనకు గురైన వారిలో ఐదుగురు మంత్రులు, ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు.
అయితే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో భాగంగానే వీరిని తొలగించినట్టు తెలుస్తోంది. వీరి స్థానంలో కొత్త మంత్రులను నియమించే అవకాశముంది. తన పాలనపై అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో దిద్దుబాట చర్యల్లో భాగంగా అఖిలేశ్ మంత్రులను తొలగించినట్టు తెలుస్తోంది.
స్వయంగా తన తండ్రే తరచూ విమర్శలు చేయడం అఖిలేశ్కు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో పనితీరు సరిగాలేదనే ఆరోపణలతో 8మంది మంత్రులను తొలగించి కేబినెట్ను ప్రక్షాళన చేసేందుకు అఖిలేశ్ ఉపక్రమించినట్టు తెలుస్తోంది. కాగా, అక్టోబర్ 31న మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపడతారని, కొత్తవారు మంత్రివర్గంలోకి రానున్నారని, బుధవారం గవర్నర్ను ముఖ్యమంత్రి కలిశారని సమాజ్ వాది పార్టీ అదికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రిని తాము చూడలేదని, వెంటనే ఆయనకు ఉద్వాసన పలికి అనుభవజ్ఞుడైన, సమర్థవంతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యాలని అధికార సమాజ్ వాది పార్టీ(ఎస్పీ)కే చెందిన ఎంఎల్సీ దేవేంద్ర సింగ్ డిమాండ్ చేశారు.
అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి అయ్యి దాదాపు నాలుగేళ్లు అవుతుందని, అయినా ఆయనకు ఓ గుర్తింపు రాలేదని, చాల స్కాంలు జరిగినా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో అన్ని శాఖలలో అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications