ఊర కుక్క కరిచింది: తుపాకితో కాల్చేసిన ఎస్ఐ
లక్నో: పోలీసులకు కోపం వస్తే ఎవరినైనా తుపాకితో కాల్చేస్తారని మరో సారి వెలుగు చూసింది. అయితే ఈ సారి ఓ ఊరకుక్కను ఎస్ ఐ కాల్చిపారేశారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఈ ఘటన జరిగింది. ఈ విషయంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ ఆదేశించారు.
లక్నోలోని చిన్హాత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదర్శ నగర్ లో సబ్ ఇన్ స్పెక్టర్ మహేంద్ర ప్రతాప్ నివాసం ఉంటున్నారు. ఈయన డ్యూటీలో ఉండగా ఓ ఊరకుక్క కరించింది. వెంటనే మహేంద్ర ప్రతాప్ ఇంటికి వెళ్లి లైసెన్స్ డ్ తుపాకి తీసుకువచ్చి తనను కరిచిన ఊర కుక్కను కాల్చిపారేశాడు.
ఎస్ఐ కాల్చిన కుక్క ఆపరిసర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించడం లేదని కథనాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐ మీద కేసు నమోదు చెయ్యడానికి పోలీసులు నిరాకరించారు.
జంతు సంరక్షణ బోర్డు సభ్యులైన కమ్నా పాండే ఈ విషయాన్ని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర మంత్రి మేనకా గాంధీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.