ఘోరం: తల్లి గర్భంలోనే శిశువు తలనొదిలేశారు
లక్నో: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబంలో ఆనందాలు పంచాల్సిన శిశువు.. నిర్జీవంగా భూమిపై అడుగు పెట్టాల్సి వచ్చింది. అది కూడా తల లేకుండానే. వైద్యుల నిర్లక్ష్యంతో ఆ శిశువు తల తల్లి గర్భంలోనే ఉండిపోయింది.
సౌకర్యాలు లేవనే సాకుతో ఆ శిశువు తల్లికి నరకం చూపించారు వైద్యులు. శిశువు మొండెన్నీ బయటికి తీసిన వైద్యులు.. తలను తీసేందుకు మరో ఆస్పత్రి తీసుకెళ్లాలని సూచించారు. మరో ఆస్పత్రి తీసుకెళ్లగా శిశువు తలను బయటితీయగలిగారే తప్ప, తల్లి ప్రాణాలు కాపాడలేకపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షాజహాన్పూర్ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. 32ఏళ్ల గీతాదేవీ అనే గర్భవతి శనివారం రాత్రి ప్రసవ వేదనతో షాజహాన్పూర్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అంతంత మాత్రంగానే సౌకర్యాలున్న ఆ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కూడా తోడడవడంతో శిశువు ప్రాణాలు పోయాయి.
గర్భ సంచిలో ఇరుక్కుపోయిన శిశువు తలను వెలికి తీసి తల్లి ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు, సరైన సౌకర్యాలు లేవన్న సాకుతో గీతాదేవి భర్త హేమంత్ను పిలిచి మరో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
హేమంత్ తన భార్యను సమీపంలోని బెరైల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు తల్లి గర్భం నుంచి శిశువు తలను బయటకు తీయగలిగారు. అయితే తల్లి ప్రాణాలను మాత్రం కాపాడలేక పోయారు. సకాలంలో శిశువు తలను బయటకు తీసి ఉన్నట్టయితే ఆమె ప్రాణం పోయేది కాదని అక్కడి డాక్టర్లు చెప్పారు.
గీతాదేవీది సంక్లిష్టమైన డెలివరని, అలాంటి డెలివెరికి షాజహాన్పూర్ ప్రభుత్వాస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని చెప్పిన షాజహాన్ పూర్ డీఎస్పీ కేజీ యాదవ్, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు తల గర్భాశయంలో చిక్కుకు పోయిందని అన్నారు. అందుకు ఎవరు బాధ్యులో కనుక్కొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, తల్లీ, శిశువుల మరణంపై జిల్లా కలెక్టర్ శుభ్రా సక్సేనా తీవ్రంగా స్పందించారు. ఇది డాక్టర్ల నిర్లక్ష్యానికి సంబంధించిన తీవ్రమైన కేసు అని, దర్యాప్తు జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. తన భార్య, బిడ్డల మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త డిమాండ్ చేశారు.