ఉత్తరప్రదేశ్లో భయానక పరిస్థితులు-అంతకంతకూ పెరుగుతున్న విష జ్వరాలు-వైద్యులు ఏమంటున్నారు...
ఉత్తరప్రదేశ్ను గత కొద్దిరోజులుగా అంతుచిక్కని విష జ్వరాలు వణికిస్తున్నాయి. అసలే కరోనా వెంటాడుతున్న కాలం... దానికి తోడు ప్రాణాంతక విష జ్వరాలతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఈ విష జ్వరాలతో ఇప్పటికే రాష్ట్రంలో పదుల సంఖ్యలో చిన్నారులు,యువతీ యువకులు మృతి చెందారు. గడిచిన కొద్దిరోజుల్లో ఒక్క లక్నోలోనే దాదాపు 400 మంది విష జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో 20 శాతం మంది పేషెంట్లలో జ్వరం,జలుబు,ముక్కు దిబ్బడ లక్షణాలు ఉన్నాయి.
వైద్యులు ఏమంటున్నారు...
రాష్ట్రంలో విజృంభిస్తున్న విష జ్వరాలపై ప్రజల్లో భయాందోళన నెలకొనగా... వైద్యులు మాత్రం ఇది సీజన్ ఫ్లూ అని చెబుతున్నారు. ఒక్కసారిగా ఫ్లూ కేసులు పెరగడంతో జనం భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. వైరల్ ఫీవర్ బారినపడిన పేషెంట్లకు కోవిడ్ యాంటీజెన్ టెస్టులు చేయకుండా ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్కు తీసుకురావొద్దని ప్రజలకు సూచిస్తున్నామన్నారు. గత ఆగస్టు మూడో వారంలో వైరల్ ఫీవర్ బాధితులు 5శాతం ఉండగా గత వారానికి అది 15శాతానికి పెరిగింది.
ఆస్పత్రులకు పెరిగిన తాకిడి...
లక్నోలోని బలరాంపూర్ ఆస్పత్రి,సివిల్ ఆస్పత్రి,లోహియా ఇన్స్టిట్యూట్లలో ఎక్కువమంది పేషెంట్లు చేరుతున్నారు.ఇప్పటివరకూ దాదాపు 300 పైచిలుకు పేషెంట్లు ఇక్కడికి వచ్చారు. మహానగర్ బావురావ్ డియోరాస్,రాణి లక్ష్మీభాయ్,రాంనగర్ మిశ్రా తదితర కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనూ వైరల్ ఫీవర్ కేసుల తాకిడి పెరిగింది.లోహియా ఆస్పత్రిలోని పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఇప్పటివరకూ 12 మంది చిన్నారులు వైరల్ ఫీవర్తో అడ్మిట్ అయ్యారు. ఇందులో ఏడుగురు చిన్నారులు లక్నోకి చెందినవారే.
ఆ టెస్టులు పెరిగాయి...
ప్రస్తుతం పాథాలజీ డిపార్ట్మెంట్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య సాధారణం కంటే ఎక్కువగా ఉంది.లోహియా ఆస్పత్రిలో మొత్తం 70 మందికి పైగా జ్వర బాధితులు వివిధ విభాగాల్లో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలోని ఓపీడీ వద్ద భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. భావురావ్ డియోరాస్ ఆస్పత్రిలోనూ ఎక్కువమంది పేషెంట్లు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కే వస్తున్నారు. ఇక్కడ 10 పడకలతో ఉన్న పీడియాట్రిక్ వార్డు ఇప్పటికే నిండిపోయింది. ప్రతీరోజు దాదాపు 10 నుంచి 15 మంది పేషెంట్లు ఇక్కడికి వస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.
Recommended Video
వాతావరణంలో మార్పులే కారణమా...
లక్నో సివిల్ ఆస్పత్రి డైరెక్టర్ ఎస్కే నంద మాట్లాడుతూ...'వాతావరణం వేగంగా మారుతోంది. తేమ శాతం పెరగడంతో వైరస్లు విజృంభించేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. దీంతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. వైరల్ ఫీవర్,ఇతర జ్వర సంబంధిత కేసులు 20 శాతం మేర పెరిగాయి.'అని తెలిపారు.
ఇటీవల ఫిరోజాబాద్ జిల్లాలో అంతుచిక్కని విషజ్వరాలతో 30 మంది చిన్నారులు, ఏడుగురు యుక్త వయస్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత మంది చనిపోవడంతో జిల్లాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.