మళ్లీ తబ్లిగీ జమాతీల అలజడి: మసీదులో నక్కి: యూనివర్శిటీ ప్రొఫెసర్ సహా 30 మందికి బేడీలు
లక్నో: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భారీగా పెరిగిపోవడానికి కారణమైనట్టు అనుమానిస్తోన్న ఢిల్లీ సామూహిక మత ప్రార్థనలు మరోసారి అలజడి పుట్టించాయి. ఓ మసీదులో నక్కిన పలువురు తబ్లిగి జమాతీలను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్ సహా 30 మంది ఉన్నారు. వారంతా ఓ మసీదులో నక్కి ఉన్నట్లు గుర్తించారు. ఈ 30 మందిలో 16 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
పూలు చల్లుకుంటూ..పూలదండలు వేసుకుంటూ: కరోనా వేళ రోజా కలకలం: సొంత పార్టీ నుంచే..!
ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదు భవన సముదాయంలో కిందటి నెల నిర్వహించిన తబ్లిగి జమాత్ సామూహిక మత ప్రార్థనల్లో పాల్గొని స్వస్థలాలకు చేరుకున్న వారి వల్ల దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కట్టు తప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నెలరోజుల తరువాత కూడా వారి అలజడి ఇంకా పలు రాష్ట్రాల్లో కనిపిస్తోనే ఉంటోంది. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని ఓ మసీదులో తలదాచుకుంటున్న 30 మంది జమాతీలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది.
16 మంది థాయ్లాండ్, ఇండోనేషియాలకు చెందిన వారు టూరిస్టు విసాల కింద భారత్కు వచ్చారని, అనంతరం తబ్లిగి జమాత్ సామూహిక సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి లాక్డౌన్ను విధించారు. ఫలితంగా- విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనితో విదేశాల నుంచి వచ్చిన జమాతీలు స్వదేశానికి వెళ్లలేకపోయారు. అలాంటి వారిని మనదేశానికి చెందిన జమాతీలు ఆశ్రయం కల్పించారని, స్థానిక మసీదుల్లో వారిని దాచి ఉంచారంటూ వార్తలు వెలువడ్డాయి.
దీనికి సంబంధించిన పక్కా సమాచారం అందడంతో ప్రయాగ్రాజ్ పోలీసులు మెరుపుదాడి చేశారు. ప్రయాగ్రాజ్లోని ఓ మసీదులో నక్కి ఉన్న 30 మంది జమాతీలను అరెస్టు చేశారు. వారిలో 16 విదేశీయులు కాగా.. వారికి ఆశ్రయం కల్పించిన మత పెద్దలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మసీదులో విదేశీ జమాతీలను ఆశ్రయం కల్పించిన వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ప్రఖ్యాత అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అని తేలడంతో ఆయనను కూడా అరెస్టు చేశారు.