ఎన్నికల ఎఫెక్ట్: విభేదాలు పక్కనపెట్టి శివపాల్తో పొత్తు ఉంటుందన్న అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. సమాజ్వాదీ పార్టీ అదినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ర్యాలీలు, బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు ప్రకటిస్తున్నారు.
తన బాబాయ్, ప్రగతిశీల్ సమాజ్ వాదీ పార్టీ అధినేత శివపాల్ యాదవ్ తో ఉన్న విభేదాలను పక్కనపెట్టి అఖిలేష్ యాదవ్ ఆయనను కలిశారు. అంతేగాక, తన బాబాయ్ పార్టీతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పొత్తు ఉంటుందని అఖిలేష్ గురువారం ప్రకటించారు.
'ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడితో సమావేశం జరిగింది. కూటమి ఏర్పాటు విషయం నిర్ణయించబడింది. ప్రాంతీయ పార్టీలను కలుపుకునివెళ్లే విధానం ఎస్పీని బలోపేతం చేస్తుంది. పార్టీని, ఇతర మిత్రపక్షాలను చారిత్రాత్మక విజయం వైపు నడిపిస్తుంది' అని అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అఖిలేష్ యాదవ్తో విభేదాల కారణంగా 2018లో ఎస్పీని వీడిని శివపాల్ యాదవ్ కొత్త పార్టీని ప్రకటించారు. కాగా, నవంబర్ నెలలో జరిగిన ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా శివపాల్ యాదవ్ తో పొత్తుకు సంబంధించిన సూచనలు చేశారు అఖిలేష్ యాదవ్.
प्रसपा के राष्ट्रीय अध्यक्ष जी से मुलाक़ात हुई और गठबंधन की बात तय हुई।
— Akhilesh Yadav (@yadavakhilesh) December 16, 2021
क्षेत्रीय दलों को साथ लेने की नीति सपा को निरंतर मजबूत कर रही है और सपा और अन्य सहयोगियों को ऐतिहासिक जीत की ओर ले जा रही है। #बाइस_में_बाइसिकल pic.twitter.com/x3k5wWX09A
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తమతో కలిసి వచ్చే చిన్న పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లతామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. కాగా, సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే ఓం ప్రకాశ్ రాజ్భర్ నాయకత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దల్ (ఆర్ఎల్డీ) పార్టీలతో పొత్తు ప్రకటించింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లినప్పటికీ.. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వంలో ముందుకు సాగుతున్న యూపీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష ఎస్పీల మధ్య పోటీ కొనసాగనుంది.