అదే జరిగితే..: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో గట్టి షాక్ తగలనుందా?
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పి) రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతునివ్వాలా? వద్దా? అని సంశయిస్తోంది. మద్దతు ఉపసంహరించుకుంటే.. బీజేపీ రాజ్యసభ లెక్కలు తలకిందులు కావడం ఖాయం.
మిత్రధర్మానికి తూట్లు పొడిచారని..:
లోక్సభ ఉపఎన్నికల అభ్యర్థుల విషయంలోనూ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తమను సంప్రదించలేదన్న కారణంతోనే ఎస్బీఎస్పి బీజేపీకి మద్దతు విషయంలో పునరాలోచనలో పడింది. కనీసం మాత్రంగానైనా తమను సంప్రదించకుండా.. మిత్రధర్మానికి బీజేపీ తూట్లు పొడిచిందని ఆ పార్టీ అధినేత ఓంప్రకాశ్ రాజ్భార్ ఆరోపించారు.
తొమ్మిదో స్థానం కోసం బీజేపీ ప్రయత్నం..:
ఉత్తరప్రదేశ్ లో మొత్తం 10స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 8 స్థానాలను బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశాలున్నాయి. అయితే ఇతర పార్టీల మద్దతుతో తొమ్మిదో స్థానాన్ని కూడా తామే గెలుచుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరో స్థానం కోసం 37మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. ఎస్బీఎస్పికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి 28మంది ఎమ్మెల్యేల మద్దతు బీజేపీకి ఉంది.
ఎందుకు విస్మరించారు..:
ఇతర పార్టీల సభ్యులు కూడా మద్దతునిచ్చే అవకాశం ఉండటంతో.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే బీజేపీ తొమ్మిదో స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశం ఉందని యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయా పార్టీలతో ఆయన మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో మిత్రపక్షమైన ఎస్బీఎస్పిని మాత్రం బీజేపీ విస్మరించడంతో ఆ పార్టీలో అసంతృప్తి రగులుతోంది.
ఇంకా డిసైడ్ చేయలేదట..:
అభ్యర్థుల ఎంపికలో వారి నిర్ణయమే అంతిమం, కానీ మిత్రపక్షంగా ఉన్నందుకు మాతో మాట మాత్రమైనా.. ఒక్క నాయకుడైనా మాట్లాడకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. బీజేపీకి మద్దతు విషయంలో ఇంకా అంతిమ నిర్ణయం తీసుకోలేదని చెబుతోంది.
మరో షాక్ తప్పదా:
ఇప్పటికే గోరఖ్పూర్, ఫల్పూర్ లోకసభ ఉపఎన్నికల్లో దెబ్బతిన్న బీజేపీకి.. ఎస్బీఎస్పి తీరు ఆందోళన కలిగిస్తోంది. ఆ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంటే.. ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమి లేకపోయినా.. ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావిస్తోంది. అలాగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.