ఉత్తరాఖండ్ ఎన్నికలు-పాత ముఖాల్నే నమ్ముకుంటున్న కాంగ్రెస్-సిట్టింగ్ లకు మరో ఛాన్స్
వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. 70 సీట్లున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో గతానుభవాల్ని మర్చిపోయి విజయం కోసం కలిసి పనిచేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల్లో సీట్ల వ్యవహారం తెరపైకి వస్తోంది. ఇందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న 11 మందిలో 10 మందికి మరోసారి సీట్లు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.
ఉత్తరాఖండ్ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధవారం సమావేశమై చర్చించింది. ఈ కీలకమైన ఎన్నికల్లో పార్టీ ఎంపిక చేసే పేర్లపై ఆలోచన చేసింది. కాంగ్రెస్ తన 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మళ్లీ అవకాశం ఇస్తుందని ఆ పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి, అంతేకాకుండా పార్టీలని సీనియర్ నాయకులకు కూడా మరోసారి టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బలమైన మోడీ వేవ్లో చాలా మంది అనుభవజ్ఞులు తుడిచిపెట్టుకుపోయారు. 70 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 57 సీట్లు బీజేపీకి దక్కగా, కాంగ్రెస్ 11 స్థానాలను నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో హరీశ్ రావత్తో సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. ఆయన కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.
ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని కొండ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ మెరుగ్గా రాణిస్తుందని అంతర్గత అంచనాలు సూచిస్తున్నాయి. ఇక కొండల్లో కాంగ్రెస్ పాత నాయకులకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని తెలుస్తోంది. పితోర్గఢ్, అల్మోరా, గంగోత్రి, దేవ్ప్రయాగ్, తెహ్రీ నియోజకవర్గాల్లో పార్టీ మాజీ ఎమ్మెల్యేలను బరిలోకి దించే అవకాశం ఉంది. అభ్యర్థిని నిలబెట్టే ముందు అనేక అంశాలను పరిశీలిస్తామని స్క్రీనింగ్ కమిటీ హెడ్ అవినాష్ పాండే తెలిపారు. యువత, మహిళా నాయకుల్ని పరిగణనలోకి తీసుకుంటామని నేతలు చెప్తున్నారు. అన్ని సెగ్మెంట్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది.
పొరుగున ఉన్న యూపీలో పోరును సైతం సీరియస్ గా తీసుకుంటున్నప్పటికీ కాంగ్రెస్ అవకాశాలు మాత్రం తక్కువే. దీంతో ఉత్తరాఖండ్ లో గెలుపుతో సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. గతంతో పోలిస్తే తమపై వ్యతిరేకత తగ్గిందని అంచనా వేస్తున్న కాంగ్రెస్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలే తమకు పనికొస్తాయనే అంచనాతో కనిపిస్తోంది.