ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా..రేసులో ఎవరున్నారు..?
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మంగళవారం(మార్చి 9) సాయంత్రం గవర్నర్తో భేటీ అయిన ఆయన... ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాకు చేసిన ఆయన మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. సీఎం రావత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మరుసటిరోజే ఈ పరిణామం చోటు చేసుకోవటం గమనార్హం. దీంతో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే ఆయన సీఎం కుర్చీ నుంచి తప్పుకున్నారని సమాచారం.
రావత్ వ్యవహార శైలి,పనితీరు పట్ల సొంత పార్టీ ఎమ్మెల్యేల్లోనే అసంతృప్తి గూడుకట్టుకుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ప్రత్యేకించి 10 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఒక వర్గం ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గత వారం ఇద్దరు అబ్జర్వర్లను ఉత్తరాఖండ్ పంపించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రమణ్ సింగ్,ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ అబ్జర్వర్ల హోదాలో ఉత్తరాఖండ్ వెళ్లారు. రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలను కలిసి వారితో మాట్లాడారు. ఆ నివేదికను బీజేపీ అధిష్టానానికి పంపించగా... వారు సీఎం రావత్ను ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. నివేదిక రావత్కు ప్రతికూలంగా ఉండటం వల్లే ఆయన్ను ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. అదే నివేదిక ఆధారంగా అధిష్టానం ఆయన్ను తప్పుకోమని కోరినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో రావత్ పార్టీ ఆదేశాల మేరకు రాజీనామాకు సిద్దపడినట్లు సమాచారం.
మరో ఏడాదిలో ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చాలనుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2017లో ఉత్తరాఖండ్లో బీజేపీ 70 స్థానాలకు 57 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే.
రావత్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్ర మంత్రి సత్పాల్ మహారాజ్,కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్,ఎంపీ అజయ్ భట్,ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి,రాజ్యసభ సభ్యుడు అనిల్ బలూని,ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి సురేశ్ భట్లలో ఒకరిని సీఎం పదవి వరించే అవకాశం కనిపిస్తోంది.